సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు ఆమోస్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ గురువారం నాడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మల్కాజిగిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. టీఎన్జీవో అధ్యక్షులుగా పని చేశారు. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
తెలంగాణ కోసం మొదటిసారి ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించబడిన ఉద్యమకారుడు కేఆర్ ఆమోస్. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించారు.
నేతల సంతాపం
ఆమోస్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు ఇతర మంత్రులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు కేటీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల పైన సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆయన నిరంతరం గళమెత్తుతూ ఉండేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ సమాజానికి ఆమోస్ చేసిన సేవలు ఎల్లకాలం గుర్తు ఉంటాయని ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు అన్నారు. ఆమోస్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమోస్ మరణం తెలంగాణ రాష్ట్రం లో పూడ్చలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అమోస్ మరణ వార్త తెలిసి సంతాపం ప్రకటించారు. తొలి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగవర్గాలను ఏకం చేసిన దివంగత అమోస్ మలి దశ ఉద్యమానికి మార్గదర్శి అన్నారు.