బీజేపీలోకి మోత్కుపల్లి: గవర్నర్ గా ఆశ కలిగించారు..కానీ: ప్రాధాన్యత దక్కుతుందని హామీ..!
తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్..దళిత నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరనున్నారు. ఆయన కాషాయం కండువా కప్పుకోవటానికి ముహూర్తం ఖరారైంది. బీజీపీ నేతల సంప్రదింపుల తరువాత సోమవారం ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నారు. కొద్ది కాలంగా మోత్కుపల్లి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది.అయితే, తనకు లభించే ప్రాధాన్యత పైనే మొత్కుపల్లి ఆ పార్టీ నేతలతో మంత నాలు సాగించినట్లు సమాచారం. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. ఆ సమయంలో వారి నుండి వచ్చిన హామీ మేరకు బీజేపీలో చేరాలని మోత్కుపల్లి నిర్ణయించారు. మోత్కుపల్లి చేరిక పార్టీకి లాభం చేస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
మోత్కుపల్లి ఎజెండా ఖరారైందా.. ఇక ఆ జెండాయేనా?
మోత్కుపల్లి నివాసానికి వెళ్లి మరీ..
తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అటు అసెంబ్లీలో..ఇటు బయటా అందరిలోనూ గుర్తింపు పొందిన మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. సోమవారం ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. వారు మోత్కుపల్లితో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు తగిన ప్రాధాన్యత లభిస్తోందని పార్టీ నేతల నుండి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పైన అంశాల వారీగా స్పందిస్తున్న మొత్కుపల్లి ఇక బీజేపీ వాయిస్ వినిపించేందుకు సిద్దమయ్యారు.
గవర్నర్ గా ఆశలు కల్పించి..
2014లో కేంద్రంలో బీజేపీ..ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో టీడీపీ నుండి ఒకరికి గవర్నర్ పదవి ఇవ్వటానికి కేంద్రం సిద్దంగా ఉందని ప్రచారం జరిగింది. అందు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు పేరు సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే, అప్పటికే తెలంగాణ నుండి విద్యాసాగర్ రావుకు గవర్నర్ పదవి ఇచ్చారు. ఆ తరువాత టీడీపీ..బీజేపీ మద్య విభేదాలు రావటంతో నరసింహులు ఎంతో కాలం ఎదురు చూసినా ఆ కల మాత్రం నెరవేర లేదు. ఇక, నరసింహులు చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యల ఫలితంగా టీటీడీపీ నుంచి మోత్కుపల్లి నరసింహులును ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. తరువాత కొద్ది కాలానికి చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు గెలవకూడదని ఆయన తిరుమలకు పాదయాత్ర కూడా చేశారు.
తొలుత గులాబీ పార్టీలో చేరుతారంటూ..
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ.. ఏపీలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లు ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అసంతృప్తి నేతలకు బీజేపీ గాళం వేస్తోంది. ఈ సందర్భంలోనే మోత్కుపల్లిని బీజేపీలో చేర్చుకునేందు బీజేపీ వేసిన స్కెచ్ ఫలించింది. దీంతో మోత్కుపల్లి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఓ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే బీజేపీ ఆయన్ను తమ వైపు తిప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మోత్కుపల్లి లాంటి వారిని చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో..ఇప్పుడు మోత్కుపల్లి రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.