నాగుల పంచమి వచ్చేస్తోంది.. పాములకు పాలు పోస్తే ఇక జైలుకే..!
హైదరాబాద్ : నాగుల పంచమి నాడు నాగేంద్రుడ్ని కొలిచి మొక్కడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగింటి ఆడపడచులు ఆ రోజు నాగదేవతకు పాలు పోస్తూ భక్తిశ్రద్ధలను చాటుకుంటారు. పాముల ఆవాసమైన పుట్టల్లో పాలు పోసి సర్పదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈసారి అలాంటి దృశ్యాలు కంటపడితే జైలుకే అంటున్నారు అటవీశాఖ అధికారులు. దాంతో ఈ కొత్త రూల్ ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇకపై నాగదేవతకు పూజల పేరిట పాము పుట్టల్లో పాలు పోస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. పాములకి పాలు పోయడం అంటే వాటిని హింసించడమేనని చెబుతున్నారు. భక్తి పేరుతో నాగేంద్రులకు పాలు పోస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మంత్రి గారి డ్యాన్స్.. అదిరేటి స్టెప్పులు.. ఆలుగడ్డ శీనన్న గతం గుర్తు చేశారుగా..! (వీడియో)
ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన వచ్చే నాగుల పంచమికి భక్తులు, ఆడపడుచులు జర జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ రోజు నాగదేవతలకు పూజల పేరిట పుట్టల్లో పాలు పోస్తే సీరియస్గా తీసుకుంటామని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు. ఆ క్రమంలో పాముల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై.. సోమవారం (22.07.2019) నాడు హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంతంలోని అరణ్య భవన్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాగుల పంచమి సందర్భంగా పాముల పుట్టల్లో పాలు పోస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్కుమార్ వెల్లడించారు. ఆ రోజు నాగదేవతలకు పూజలు చేసి పుట్టల్లో పాలు పోసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ అలా నాగుల పంచమి రోజున పాములకు పాలు పోయడం.. పాములు ఆడించడం లాంటివి జంతుహింస చట్టం కిందకు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
కేసీఆర్కు మరో షాక్.. అప్పుడు హైకోర్టు.. ఇప్పుడు గవర్నర్..!
పాములు ఎట్టిపరిస్థితుల్లో పాలు తాగబోవని, ఆ క్రమంలో వాటికి బలవంతంగా పాలు పోస్తూ ఇబ్బంది పెట్టొద్దని సూచిస్తున్నారు. దేవాలయాల దగ్గర గానీ.. కాలనీలు, బస్తీల్లో గానీ ఎవరైనా పాములు ఆడిస్తుంటే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫారెస్ట్ డిపార్టుమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 18002455364 కు కాల్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పుట్టల్లో పాలు పోసే వారి వివరాలు ఇస్తే వారిని జైలుకు పంపేందుకు సిద్ధమని ప్రకటించారు.