అమీర్ పేటలో అశ్లీల దందా.. హోటల్ అడ్డాగా వ్యభిచారం .. గుట్టు రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. నిత్యం బిజీగా ఉంటే అమీర్ పేట ప్రాంతంలో హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
అమీర్ పేటలో హైటెక్ వ్యభిచారం ... ఓయో టౌన్ విల్లా హోటల్లో సాగుతున్న దందా
అమీర్ పేటలోని ధరమ్ కరమ్ రోడ్డు లో ఓయో టౌన్ విల్లా హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నాని అలియాస్ జోగీశ్వర్, అరవన్ , హోటల్ మేనేజర్ ప్రేమ్ కలిసి హోటల్లో వ్యభిచారం కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు .సోషల్ మీడియా ద్వారా విటులను ఆకర్షిస్తున్న సదరు గ్యాంగ్ ఓయో టౌన్ విల్లా హోటల్ ను తమ అడ్డాగా మార్చుకున్నారు. ఇక హోటల్ కి వచ్చి బస చేసే వారికి సైతం అమ్మాయిలను ఎర వేసి దందా నిర్వహిస్తున్నారు ఈ హైటెక్ గ్యాంగ్.
వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు హోటల్ పై దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు .ఇద్దరు యువతులను హోటల్ మేనేజర్ ప్రేమ్ తో పాటు రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు నాని అలియాస్ జోగీశ్వర్ లను అదుపులోకి తీసుకున్నారు . ఇక మరో నిర్వాహకుడు అరవన్ పరారీలో ఉన్నాడు. ఇక ఈ దందాకు సంబంధించి మరింత కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు.ఇక వీరితో మరికొంత మందికి లింక్ ఉన్నట్టు చెప్తున్నారు. వారికోసం కూడా గాలింపు చేపట్టారు.
మార్చి నెలలోనూ అమీర్ పేటలో హోటల్ అడ్డాగా వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు
నగర నడిబొడ్డున విచ్చలవిడిగా సాగుతున్న తీరు అటు పోలీసులను, ఇటు ప్రజలను షాక్ కు గురి చేస్తుంది. గత మార్చి నెలలో కూడా అమీర్ పేట కేంద్రంగా విదేశీ వనితలతో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఆదిత్య పార్క్ హోటల్ లో హైటెక్ వ్యభిచార దందా జరుగుతోందన్న సమాచారంమేరకు రైడ్ చేసిన పోలీసులు ఈ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నారు . ఎస్సార్ నగర్ పోలీసులు చేసిన ఈ దాడుల్లో హోటల్ ను నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. ఇదే సమయంలో పంజాగుట్టలోని పోలో లాడ్జిపైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఉజ్బెకిస్థాన్ కు చెందిన నలుగురు యువతులు, బెంగాల్ కు చెందిన యువతి, నలుగురు విటులు పట్టుబడ్డారు.