శబ్బాష్ పీసిబి..! పెరుగుతున్న నగర కాలుష్యం పై ఉక్కుపాదం..!!
హైదరాబాద్ : నగరంలో పెరిగి పోతున్న కాలుష్యం పై కాలుష్య నియంత్రణ మండలి ఉక్కుపాదం మోపబోతోంది. నగరంలో కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో అధికారులు కాలుష్య నివారణపై దృష్టి పెట్టారు. నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య కారకాలను గుర్తించేందుకు పీసీబీ యంత్రంగాన్ని నడుం బిగిస్తోంది. కొత్త కొత్త వాయువులను, కాలుష్యాన్ని పసిగట్టేందుకు పీసీబీ అత్యాధునిక పరికరాలను సమకూర్చుకుంటున్నది. దీంతో కాలుష్యం వెదజల్లో వ్యవస్థల పట్ల కొరడా ఝుళిపించబోతోంది పీసిబి.
నగరానికి శరాఘాతంలా కాలుష్యం..! ఉక్కుపాదం మోపాలని అదికారుల కార్యాచరణ..!!
వాతావరణానికి సవాల్ విసురుతున్న వాయువులను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు సన్నద్ధమవుతున్నది. దీంట్లో భాగంగా కొత్తగా 35 కొత్త పరికరాలను పీసీబీ అధికారులు కొనుగోలు చేయబోతున్నారు. ఈ పరికరాల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. ప్లూగ్యాస్ అనలైజర్తో ఆక్సైడ్లు సహా కార్బన్డైయాక్సైడ్, కార్బమోనాక్సైడ్ వాయువుల తీవ్రతను పసిగడతారు.
నగర శివార్లలోని కంపెనీలపై ద్రుష్టి..! ల్యాబోరేటరీలపై పీసిబి కన్ను..!!
సీవో ప్యారామీటర్స్ను కచ్చితంగా తెలుసుకునేందుకు కార్బన్మోనాక్సైడ్ గ్యాస్ డిటెక్టర్లు. ఆర్గానైక్, బెంజిన్, ఫెస్టిసైడ్స్లను తెలుసుకునేందుకు గ్యాస్ క్రొమెటోగ్రఫీలను కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా వాతావరణంలోని ఆయా వాయువుల పరిణామాన్ని అత్యంత వేగంగా, ఎక్కడికక్కడే తెలుసుకోవచ్చు. పీసీబీకి సనత్నగర్తో పాటు, రామచంద్రాపురంలో ప్రయోగశాలలున్నాయి. సనత్నగర్లో సెంట్రల్ ల్యాబ్ ఉండగా, రామచంద్రాపురంలో జోనల్ ల్యాబ్లున్నాయి.
ముమ్మరంగా తనిఖీలు..! కొరఢా ఝళిపించనున్న బోర్డ్..!!
గ్రేటర్తో పాటు శివారులోని పటాన్చెరు, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా నమోదవుతున్నది. అయితే కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు నమోదుచేయడం బోర్డుకు సవాల్గా మారింది. కాలుష్య నమోదు కేంద్రాల వద్ద నమోదవుతున్న కాలుష్యాన్ని మాత్రమే బోర్డు అధికారులు తెలుసుకోగలుగుతున్నారు. ఇక ఎక్కడైనా ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేయిస్తున్నారు. అయితే తాజాగా పీసీబీ అధికారులు వ్యుహాన్ని మార్చి ఫీల్డ్ మానిటరింగ్ను ఎంచుకున్నారు. ఫిర్యాదులందినా.. అందకపోయినా సుమోటాగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించబోతున్నారు.
పరిశ్రమలపై మెరుపు దాడులు..! నిర్థారణ జరిగితే కఠిన చర్యలు..!!
అనుమానం వస్తే ర్యాండమ్గా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, కాలుష్యాన్ని నమోదుచేయనున్నారు. ఇది వరకు ఫిర్యాదులందడం.. పీసీబీ సైంటిఫిక్ విభాగం సిబ్బంది, పరికరాలు.. సామగ్రి తీసుకుని సమాయత్తం కావడం.. స్పాట్కి వెళ్లడం.. అంతలోపే ఉల్లంఘనులు సర్ధుకోవడం మామూలవుతుంది. అంతదూరం వెళ్లి పీసీబీ సిబ్బంది దాడులు.. తనిఖీలు నిర్వహిస్తున్నా.. ప్రయోజనం లేకపోవడంతో.. ఫీల్డ్ మానిటరింగ్ను ఎంచుకుని అమలుచేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆయా ప్రయోగశాలలకు పరికరాలు సమకూర్చేందుకు పీసీబీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.