వసతి వణికిస్తోంది.!చలి దులిపేస్తోంది..! గజగజో రామచంద్ర అంటున్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు.
హైదరాబాద్ : చలికి ఎవరైనా బిగుసుకు పోవాల్సిందే..! చిన్నా, పెద్దా, ముసలి, ముతక తారతమ్య భేదం లేకుండా చలి అందరినపైనా ప్రతాపం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతాగా చలి పులిలా గాండ్రిస్తుండడంతో అటు పట్టణ వాసులు, ఇటు పల్లెటూరి వాసులు గజగజ వణకడం మినహా చేసేదీ ఏమీ లేనట్టుగా తెలుస్తోంది. వాతవరణం లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ సారి తెలంగాణ వ్యాప్తంగా చలి ఊటీని మరిపిస్తోంది.
మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే జనాలు జమ్ము కాశ్మీర్ జనాల్లాగా మొత్తం స్వెట్టర్లతో కవర్ చేసుకునే పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అరకొర సౌకర్యాలతో సంక్షేమ హాస్టళ్లతో గడిపే విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. చలి ఎములకను నమిలేస్తున్నా కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక విద్యార్థుల వణికిపోతున్నారు.
వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక నేలపైనే నిద్రిస్తూ చాలీచాలని దుప్పట్లతో అవస్థలు పడుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులను వదిలి..సంక్షేమ వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు తగిన విధంగా వసతి కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులను రాత్రివేళ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అదేమని ప్రశ్నిస్తే నెపాన్ని ప్రభుత్వం పై తోసి చేతులు దులుపుకుంటున్నారు స్థానికి అదికారులు. అటు ప్రభుత్వానికి ఇటు అదికారులకు సమన్వయం లేక పోవడంతో సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది.