కొత్త ఏడాదికి షాకే: పెరిగిన మద్యం ధరలు, ఒక్కో బీరుపై ఎంతంటే.?
హైదరాబాద్: మద్యం ప్రియులకు ఇది కొంత చేదువార్తే. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న మద్యం ప్రియులకు ఇది కొంత నిరాశ కలిగించే అంశమేనని చెప్పవచ్చు.
బాటిల్ సామర్థ్యాన్ని బట్టి మద్యంపై రూ. 20 నుంచి రూ. 80, బీరుపై రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచినట్లు ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెరిగిన ధరల పట్టికను ఆయన విడుదల చేశారు. పెరిగిన ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి.
పాత నిల్వలకు ధరల పెంపు వర్తించదని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు అదనపు ఆదాయం సమకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు కూడా పెరిగిన విషయం లేదు.
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కరీంనగర్ కలెక్టర్గా శశాంకను నియమించారు. కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ను బదిలీ చేసి ఆయన్ను ఎక్సైజ్ శాఖ కమిషనర్గా పంపించారు.
జోగులాంబ గద్వాల్ కలెక్టర్గా వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశ్వరరావు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీగా అశోక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.