శిఖా నేరస్తురాలే అంటున్న పద్మశ్రీ..! కాదంటున్న పోలీసులు..! జయరాం హత్యలో విచిత్ర కోణం..!!
హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. చిత్ర విచిత్ర మలుపులు తీసుకుంటూ హత్యను ఎవరు ప్రేరేపించారో తెలియని పరిస్తితులు నెలకొన్నాయి. జయరాం హత్యలో మేన కోడలు శిఖా చౌదరి కీలక పాత్ర పోషించిందని స్వయానా జయరాం భార్య పద్మశ్రీ చెప్పుకొస్తుండగా. అసలు శిఖా చౌదరికి జయరాం హత్యోదంతంతో సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్తున్నారు. దీంతో పద్మశ్రీ తివ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హత్యోదంతంలో కీలక పాత్ర శిఖా దే..! జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో పద్మశ్రీ ఫిర్యాదు..!!
జయరామ్ హత్య తన జీవితాన్ని కుంగదీసిందని చిగురుపాటి పద్మశ్రీ అన్నారు. తనకు న్యాయం కావాలని, తన భర్తను అత్యంత క్రూరంగా చంపారని ఆవేదన వ్యక్తం చేస్తోంది జయశ్రీ. దీంతో తన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, తన కుమారుడు తండ్రి లేనివాడు అయ్యాడన్నారు. తన కుటుంబం చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యోదంతంలో తనకు న్యాయం కావాలి అని అన్నారు. తన న్యాయవాది, తండ్రి పిచ్చయ్య చౌదరితో కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు మూడు పేజీల ఫిర్యాదు పద్మశ్రీ అందచేశారు.
ఏపి పోలీసులపైన నమ్మకం లేదు..! శిఖాను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటున్న పద్మశ్రీ..!!
జయరామ్ హత్య హైదరాబాద్ లో జరగ్గా, శవాన్ని ఏపీ కి తరలించారు. ఇక్కడ హత్య చేసి అక్కడికి తరలించాల్సిన అవసరం ఏమోచ్చిందని, ఇందులో అనేక కుట్ర కోణాలు ఉన్నాయన్నారు పద్మశ్రీ. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, శిఖా చౌదరి ఏపీ పోలీసులను ప్రభావితం చేసి ఉండవచ్చన్న సందేహాన్ని పద్మశ్రీ వ్యక్తం చేస్తున్నారు. తనకు ఏపిలో న్యాయం జరిగే అవకాశాలు రనిపించడం లేదని అందుకే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపారు.
జయరాం హత్యతో దిక్కులేని వాళ్లం అయ్యాం..! శిఖా ప్రమేయం ఉందంటున్న జయరాం భార్య..!!
హైదరాబాద్ కు వచ్చే వరకు తనకు హత్య జరిగినట్లు తెలియదని, వచ్చాకే చేదు వార్త తెలిసిందన్నారు. హత్య జరిగిన తరువాత శిఖా చౌదరి శవం వద్దకు వెళ్లకుండా తన ఇంట్లోకి వచ్చి డాక్యుమెంట్లు వెతికి, తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించారన్నారు. ఆయన చనిపోయిన తరువాత ఆస్తుల కోసం కుట్రపన్నిందన్నారు. రాకేష్ వ్యవహారాలు, శిఖా పాత్రపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. తన భర్తతో ఎలాంటి విబేధాలు లేవని, అన్యోన్యంగా జీవితస్తున్నామన్నారు పద్మశ్రీ.
శిఖా నిమిత్త మాత్రురాలు..! ఆమెకు హత్యతో సంబందం లేదంటున్న ఏపి పోలీసులు..!!
జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరికి పాత్ర లేదని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు. ఆమె పాత్ర ఉందనడానికి ఆధారాలు లేవన్నారు. గతంలో శిఖాకు, రాకేష్ మధ్య సంబంధం ఉన్నది వాస్తవమేనని అన్నారు. అయితే మూడు నెలల నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారన్నారు. శిఖా చౌదరితో మాట్లాడాం, ఆమె నుంచి చాలా వివరాలు సేకరించామన్నారు. దర్యాప్తు వివరాలు పూర్తిగా చెప్పకపోవడంతో మీడియా ప్రతినిధులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.