షైన్ ఆసుపత్రి సీజ్, ఆసుపత్రి వద్ద విచారణ బృందం
షైన్ ఆసుపత్రి దారుణం పై ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే జరిగిన సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పలు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆసుపత్రి నడిపేందుకు గడువు ముగుస్తున్నా... తిరిగి అనుమతి తీసుకునేందుకు నేటి వరకు ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రాలేదు. దీంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. అటు మున్సిపల్ అధికారులు కూడ నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రి భవన నిర్మాణం ఉండడంతో కూల్చివేతకు సిద్దమయ్యారు.
షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం .. ఒక పసికందు మృతి, 5గురు చిన్నారుల పరిస్థితి విషమం
అడుగడుగుగన షైన్ ఆసుపత్రి నిర్లక్ష్యధోరణి
హైదరాబాద్లో చిన్నారుల ప్రాణాలను ఫణంగా పెట్టిన షైన్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యధోరణి అడుగడుగునా కనిపిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సోమవారం తెల్లవారు జామున సంఘనలో ఒక శిశువు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న మరో అయిదుగురు పిల్లలు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఇది ఇలా ఉంటే, నిబంధనల ప్రకారం ఆసుపత్రి నడిపేందుకు అనుమతి కూడ తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో అనుమతి ముగియనుంది. కాగా అనుమతి కోసం మూడు నెలల ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నేటివరకు కూడ ఎలాంటీ ధరఖాస్తులు చేయలేదు. దీంతో ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
మున్సిపల్ అధికారుల హడావిడి
మరోవైపు మున్సిపల్ అధికారులు కూడ ఆసుపత్రి వద్ద హడవిడి చేస్తున్నారు. ఇన్నాళ్లు బహిరంగంగానే మెయిన్ రోడ్డుపై ఉన్న ఆసుపత్రి భవనాన్ని, ప్రమాదం తర్వాత నిబంధనలకు విరుద్దంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 150 గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తులు నిర్మించుకోవాల్సి ఉండగా ఆసుపత్రి యాజమాన్యం నాలుగు అంతస్తులను నిర్మించింది. అయినా పట్టణ ప్రణాళిక విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. భవనాన్ని నిబంధనలకు విరుద్దంగా నిర్మించినా.. అటు మున్సిపల్ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు, ఆగ్నిమాపక విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అధికారుల తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు నేడు ఆసుపత్రి వద్ద హడావిడి చేశారు. ఆసుపత్రి నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. అంతా జరిగాక చర్యలంటు అసుపత్రి వద్ద హంగామా సృష్టిస్తున్నారు.
ఆసుపత్రికి చేరుకున్న విచారణ బృందం
ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ జరిపేందుకు ఉన్నతాధికారుల బృందం ఆసుపత్రి వద్దకు చేరుకుంది. సంఘటనకు సంబంధించి పేషంట్లు, వారి బంధువులతో విచారణ జరుపుతున్నారు. మరోవైపు నిర్లక్ష్యానికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. విచారణ బృందంలో పోలీసు అధికారులతోపాటు వైద్య అధికారులు ఉండగా ఆసుపత్రి వ్యవహరించిన తీరుపై విచారణ బృందం నివేదిక తాయారు చేయనుంది. అనంతరం భవిష్యత్లో ఇలాంటీ సంఘటనలు పునరావృతవం కాకుండా పలు సూచనలు కూడ చేయనుంది.