మరో వారసుడొస్తున్నాడు.. ప్రజాయాత్రకు బయల్దేరాడు.. తెలుగు నేతల స్ఫూర్తియేనా..!
హైదరాబాద్ : పాదయాత్రలతో అధికారం వస్తుందా? ప్రజాయాత్రలతో జనాలు కనెక్ట్ అవుతారా? ఆశీర్వాద యాత్రలతో విజయం వరిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు తెలుగు నేతల విజయగాథలు అవుననే సమాధానం చెబుతాయి. ఒక చంద్రబాబునాయుడు.. ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల ద్వారానే అధికారం చేపట్టిన సందర్భాలున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతలా తెలుగు రాష్ట్రాల్లో వర్కవుటయిన పాదయాత్రల స్ఫూర్తో ఏమోగానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రం నేత 4వేల కిలోమీటర్ల ప్రజాయాత్ర చేసేందుకు సిద్ధం కావడం చర్చానీయాంశమైంది.
తెలుగు రాజకీయాల్లో అలుపెరగని "పాదయాత్రలు"
తెలుగు రాజకీయాల్లో పాదయాత్ర అలుపెరగనిది. పాదయాత్రల విషయంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ రికార్డులు బ్రేక్ చేసింది. 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర చేయడంతో జనాలకు దగ్గరయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2003లో మండుటెండలను లెక్కచేయక 1468 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర ప్రస్థానంతో వైఎస్ఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.
ఆ తర్వాత వైఎస్ కుటుంబం నుంచి ఆయన కూతురు షర్మిళ జగనన్న వదిలిన బాణాన్ని అంటూ 2013లో పాదయాత్ర చేపట్టారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి 2017, నవంబర్ 6 వ తేదీన ఇడుపుల పాయలో సుదీర్ఘ పాదయాత్రకు తొలి అడుగు వేశారు. 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 2019, జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు అనూహ్య స్పందన వచ్చింది. చివరకు ప్రజామద్దతుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. రాజకీయాల్లో పాదయాత్ర వర్కవుట్ అవుతుందని గ్రహించిన చంద్రబాబు నాయుడు కూడ వస్తున్నా మీకోసం అంటూ ఆయన కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయం సాధించారు.
ఆ ఎమ్మెల్యేలు కారెక్కడం కరెక్టే.. అసెంబ్లీలో కేసీఆర్ ఏమన్నారంటే..!
మరో వారసుడొస్తున్నాడు..!
తెలుగు నేతల పాదయాత్ర స్ఫూర్తియో ఏమో గానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అలాంటి సీన్ కనిపించబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన ఆచితూచి అడుగులేస్తోంది. మిత్రపక్షమైన బీజేపీతో జతకట్టి ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ క్రమంలో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ పార్టీ యువజన విభాగం నాయకుడు ఆదిత్య ఠాక్రేను సీఎం అభ్యర్థిగా బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది.
ఆదిత్య ఠాక్రేను ఫ్యూచర్ లీడర్గా తీర్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్తో శివసేన ఒప్పందం కుదుర్చుకున్నారనే టాక్ నడుస్తోంది. ఆ మేరకు సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించేలా ప్రచార కార్యక్రమాలు కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఆదిత్య ఠాక్రే.. జన ఆశీర్వాద యాత్ర
శివసేన వారసుడిగా రంగంలోకి దిగిన ఆదిత్య ఠాక్రే గురువారం (18.07.2019) నాడు ప్రజాయాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇంటింటికీ శివసేన లక్ష్యాలను, ఉద్దేశాలను చేర్చాలనే లక్ష్యంతో జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ఆదిత్య శ్రీకారం చుట్టారు. పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక వాహనంలో బయల్దేరారు. జలగాన్ నుంచి ప్రారంభమైన జన ఆశీర్వాద యాత్ర నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఆయన పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి సిద్ధమైంది.
కారు జోరుకు కళ్లెం.. బీజేపీతోనే సాధ్యం..! హైకమాండ్ స్ట్రాటజీ ఇదేనా?
ఓట్లు అడిగేందుకు కాదు ఈ యాత్ర..!
ఈ యాత్రతో ప్రజలను ఓట్లు అడగబోనంటున్నారు ఆదిత్య ఠాక్రే. ఇది ఒక పవిత్ర యాత్ర అంటూ అభివర్ణించారు. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలో వారసత్వంగా నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చారు. అది క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకే ఈ యాత్ర అంటూ వ్యాఖ్యానించారు. అదలావుంటే ఉద్దవ్ ఠాక్రే స్థానం భర్తీ చేయగల సత్తా ఆదిత్య ఠాక్రేకు మాత్రమే ఉందనేది పార్టీలోని సీనియర్ల అంతరంగంగా కనిపిస్తోంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కేవలం 29 ఏళ్ల ప్రాయంలో ముఖ్యమంత్రైన ఘనత ఆదిత్యకే దక్కుతుందనే వాదన లేకపోలేదు. అటు తమిళనాట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వారసుడిగా రంగంలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రజాయాత్ర చేపట్టడం విశేషం.