కేసీఆర్ గారికి విజ్ఞప్తి... దయచేసి ఆ విషయంలో చొరవ చూపాలని... కన్నీళ్లు పెట్టుకున్న శివ బాలాజీ భార్య
ఫీజుల విషయంలో ప్రేవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ ఇటీవల నటుడు శివ బాలాజీ,అతని భార్య మధుమిత గొంతెత్తిన సంగతి తెలిసిందే. మణికొండలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై మానవ హక్కుల కమిషన్కు కూడా శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రైవేట్ స్కూల్ ఫీజుల అంశంపై హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ బాలాజీ,మధుమిత ఒకింత భావోద్వేగంగా మాట్లాడారు. పేరెంట్స్కు అండగా నిలబడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేసిన మధుమిత కన్నీళ్లు పెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి...
'ప్రియమైన ముఖ్యమంత్రి గారికి మాదొక విజ్ఞప్తి... మీ మీద గౌరవంతో మీరు చెప్పిన మాటను నమ్ముతూ పిల్లలను అన్యాయంగా పీకి పడేస్తుంటే హెచ్ఆఆర్సీని ఆశ్రయించాం. ప్రభుత్వం ఇచ్చిన జీవోను పట్టించుకోకుండా గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా పూర్తి ఫీజు కట్టాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వేధిస్తున్నాయి. జీవోలో తల్లిదండ్రుల నుంచి కేవలం 50శాతం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్పారు. కానీ ప్రైవేట్ యాజమాన్యాలు అన్నీ ట్యూషన్ ఫీజులోనే కలిపి పూర్తి ఫీజుకు డిమాండ్ చేస్తున్నాయి.' అని మధుమతి పేర్కొన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న మధుమిత...
'ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా... ఇలా మొత్తం ఫీజు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తే... సరిగ్గా పరీక్షల ముందు పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి పీకేస్తున్నారు. ఒక నటిగా,ఇల్లాలిగా,భార్యగా ఇప్పటివరకూ ఎన్నో చూశాను. కానీ నా పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించినప్పుడు ఎంతో చలించిపోయాను. పిల్లల పసి మనసులు ఎందుకు గాయపరుస్తున్నారు...' అంటూ మధుమిత కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ట్యాబ్స్ కొనివ్వలేక,ఫీజులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. తన భర్త తనకు అండగా ఉన్నాడు కాబట్టి... బయటకు వచ్చి తన వాయిస్ వినిపిస్తున్నానని... కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఇలా కోర్టులు చుట్టూ తిరగగలరని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు... దయచేసి ఈ విషయంలోనూ చొరవ తీసుకుని పేరెంట్స్కు అండగా నిలవాలని మధుమిత విజ్ఞప్తి చేశారు.
ప్రతీ పేరెంట్ తరుపున పోరాడుతాను : శివ బాలాజీ
ఇదే సమావేశంలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ... స్కూళ్లు ఎలాగు నడవట్లేదు కదా... ఎలక్ట్రిసిటీ బిల్లు,వాటర్ బిల్లు లాంటివి ఫీజుల్లో నుంచి తీసేయాలని కోరితే స్కూల్ యాజమాన్యాలు వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాయని చెప్పారు. ఇన్నేళ్లు పేరెంట్స్ మద్దతునిస్తే కదా మీరు స్కూళ్లు నడిపిందని ప్రైవేట్ యాజమాన్యాలను ఉద్దేశించి పేర్కొన్నారు. మీవల్ల ఇప్పుడు ఎంతోమంది ఏడుస్తున్నారని... కనీసం ఇప్పుడైనా మానవత్వంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇకనుంచి తాను ఇదే పనిపై ఉంటానని... రాష్ట్రంలో ప్రతీ పేరెంట్ తరుపున పోరాడుతానని చెప్పారు. ఫీజుల పేరుతో పేరెంట్స్ను వేధిస్తున్న స్కూళ్ల ముందు నిలబడుతానని,ప్రశ్నిస్తానని చెప్పారు.
Recommended Video
హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో...
హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై నటుడు శివ బాలాజీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరినందుకు... చెప్పా పెట్టకుండా తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించారని ఆయన హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పేరెంట్స్పై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దోపిడీ,వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. శివ బాలాజీ ఫిర్యాదుతో సదరు స్కూల్ వ్యవహారంపై హెచ్ఆర్సీ విచారణకు ఆదేశించింది.