ఫలించని రేవంత్ మంత్రాంగం, టీఆర్ఎస్లోకి సబిత ఇంద్రారెడ్డి: రాహుల్ గాంధీ రంగంలోకి దిగినా..
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియలు తెరాసలో చేరారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా అధికార తెరాసలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ సీనియర్లు రెండు రోజులుగా ఆమెతో మాట్లాడి బుజ్జగించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం మహేశ్వరం నియోజవకర్గంలోని తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తెరాస వైపు చూపు, డైలమా: సబితా ఇంద్రారెడ్డి వెనుక వైసీపీ చక్రం? ఎందుకంటే..
అంతలోనే మళ్లీ షాకిచ్చారు
సబితా ఇంద్రారెడ్డితో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలు చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కూడా ఫోన్లో మాట్లాడించారు. ఆమెను రాహుల్.. ఢిల్లీకి ఆహ్వానించారు. దీంతో ఆమె యూటర్న్ తీసుకున్నారని భావించారు. సబిత తనయుడు కార్తీక్ రెడ్డితో రేవంత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో రేవంత్ బుజ్జగించారు. కానీ అంతలోనే.. మళ్లీ ఆమె మరోసారి యూటర్న్ తీసుకున్నారు. రెండు రోజుల్లో తెరాసలో చేరనున్నారు.
కొడుకు కోసం చేవెళ్ల టిక్కెట్ కోసం
తన తనయుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోకసభ స్థానాన్ని అడుగుతున్నారు. కానీ తెరాస నుంచి వచ్చిన ఎంపీ విశ్వేశ్వర రెడ్డికి కాంగ్రెస్ ఆ సీటు కేటాయించింది. దీనిపై సబిత, కార్తీక్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు, తమతో చర్చించకుండానే ఆయనను చేర్పించుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
తెరాస నుంచి టిక్కెట్ హామీ
తెరాస ముందు సబిత రెండు షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకటి తనకు మంత్రి పదవి, రెండు తన తనయుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల సీటు. చేవెళ్ల టిక్కెట్ ఇచ్చేందుకు ఇటీవల అసదుద్దీన్ ఇంట్లో జరిగిన భేటీలోనే కేటీఆర్ అంగీకరించారని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెరాస నుంచి కార్తీక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి 2014లో గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.