తహసీల్దార్ హత్యకేసులో ట్విస్ట్ ... విజయారెడ్డి హత్య కు సురేష్ రెక్కీ , హత్య వెనకాల వారి హస్తం ?
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి సజీవ దహనానికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు సిట్ బృందం. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు వివాదాస్పద భూముల కారణమనే వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నేతల హస్తం ఉందని భావించిన సిట్ బృందం, పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
విజయారెడ్డి సజీవదహనం: సురేష్ కాకుండా.. ఇంకా చాలా మంది హస్తం.. భర్త 'సీబీఐ’ డిమాండ్
విజయారెడ్డి హత్య పక్కా ప్లాన్ ... హత్యకు ముందే సురేష్ రెక్కీ
ఇక ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద నిందితుడు సురేష్ రెక్కి నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఘటనకు రెండు రోజుల ముందు విజయారెడ్డి ఇంటి దగ్గర ఆమె భర్తతో సురేష్ మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సైతం సేకరించారు. వనస్థలిపురం ఏసిపి సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తున్న నేపధ్యంలో సురేష్ విజయారెడ్డి ని ఇంటి వద్దే చంపాలని భావించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
విజయారెడ్డి భర్తతో సురేష్ ఏం మాట్లాడారో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అయితే విజయారెడ్డి ఇంటికి వెళ్ళిన సురేష్ ఆమె భర్త సుభాష్ రెడ్డి తో ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక విజయా రెడ్డి ఇంటికి వెళ్లే ముందు సురేష్ తన స్నేహితులతో ఈరోజు తాడోపేడో తేల్చుకుంటామని మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత తహసిల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి ని సజీవదహనం చేసి, తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సురేష్ తీవ్రగాయాలతో రోడ్డు పైకి వెళ్ళాడు. అక్కడ రోడ్డుపై ఆగివున్న కారులో ఉన్న వ్యక్తులతో సురేష్ మాట్లాడినట్లుగా సిసిటివి ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది.
హత్య తర్వాత సురేష్ మాట్లాడింది ఎవరితో ?
ఇంతకీ కారులో ఉన్న వ్యక్తి ఎవరు? సురేష్ అతనితో ఎందుకు మాట్లాడాడు ..ఏం మాట్లాడాడు అన్నది దర్యాప్తు చేసే పనిలో పడ్డారు పోలీసులు. హత్యకు వారికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు.ఇక సురేష్ భార్య చెప్పిన విషయాలు సైతం కేసులో ఆసక్తికరంగా మారాయి.తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసులో సురేష్ అలా ఎందుకు చేశాడో తమకు తెలియదని, తన భర్తను ఎవరో పావుగా వాడుకున్నారని సురేష్ భార్య లత కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తన భర్తను పావుగా వాడుకున్నారని సురేష్ భార్య వ్యాఖ్యలు
ఇక అంతే కాదు తన భర్త చాలా అమాయకుడని చెప్పిన లత ఏ భూమి కోసమైతే తన భర్త విజయారెడ్డిని చంపాడని అంటున్నారో అసలు ఆ భూమి గురించి అతనికి ఏమీ తెలియదని చెప్పారు. ఇక ఇదే సమయంలో ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆ భూమి కోసం ఆయన తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం మొదలైందని ఆమె అన్నారు. తాను, తన భర్తభూమిఅమ్మి అప్పులు తీర్చుకోవాలని అనుకున్నామని లత చెప్పారు. కానీ హత్య వెనుక ఎవరో ఉన్నారనే అనుమానం సురేష్ భార్య సైతం వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ కేసులో కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి.