సిరిసిల్ల స్పెషల్.. కేటీఆర్ బంపరాఫర్.. పంచాయతీ ఏకగ్రీవమైతే పండుగే
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యూహాత్మక ఆలోచనలకు పదును పెడుతున్నారు కేటీఆర్. పార్టీ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న రోజు నుంచే మరింత యాక్టివ్ గా మారారు. అసెంబ్లీ ఎన్నికల విజయం మీకే అంకితమంటూ క్యాడర్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో కీ రోల్ పోషిస్తూనే కారును పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలపై నజర్ పెట్టిన కేటీఆర్.. అందుకనుగుణంగా పావులు కదుపుతున్నారు. పంచాయతీల్లో గులాబీ వికసించేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని పంచాయతీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు భారీ నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో సిరిసిల్ల సెగ్మెంట్ లో పంచాయతీలు ఏకగ్రీవమైతే పండుగే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏకగ్రీవమైతే నిధుల హోరు.. 10 + 15 లక్షలు
పంచాయతీ ఎన్నికల్లో అంతా తానై చక్రం తిప్పుతున్నారు కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. సిరిసిల్లలో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మనకు పోటీలేదని.. అసలు ప్రతిపక్షమే లేదని.. మనోళ్ల మధ్యే పోటీ ఉందంటూ వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది. అయితే అంతా మనోళ్లే కాబట్టి పోటీయే లేకుండా ఏకగ్రీవమయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రభుత్వమిచ్చే 10 లక్షల నజరానాతో పాటు అదనంగా మరో 15 లక్షలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సిలిండర్, బకెట్, కుర్చీ, బీరువా.. పంచాయతీకి చేరిన ఇంటి సామాన్లు..!
ఇప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలే..!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ఆదర్శంగా నిలిచిందని.. పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ కావాలని ఆకాంక్షించారు కేటీఆర్. సిరిసిల్ల సెగ్మెంట్ లోని మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవంగా దక్కించుకుని రికార్డు సృష్టించాలని కోరారు. సర్పంచ్ పదవి కోసం ఒక్కో గ్రామం నుంచి ముగ్గురు నలుగురు తనకు మెసేజ్ పెడుతున్నారని తెలిపారు. అలా కాకుండా సర్దుబాట్లతో ఒప్పందాలు చేసుకుని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీశ్రేణులంతా తనకు సమానమని, ఒకరు దగ్గర మరొకరు దూరమనే తారతమ్యాలు లేవని స్పష్టం చేశారు. అందరూ ఏకతాటిపై నిలబడి పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో గులాబీ వికసించాలి
గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. మెజార్టీ పంచాయతీలను దక్కించుకుని కారు జోరు మరింత పెంచాలన్నారు. 2019 ని ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణించిన కేటీఆర్.. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ సత్తా చూపించాలని కోరారు. గ్రామాల్లో అసలు ప్రతిపక్షమే లేకుండా పోయిందని.. కాంగ్రెస్ నేతలు జాడలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అందుకే పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీశ్రేణుల మధ్యే పోటీ నెలకొందని.. భేషజాలకు పోకుండా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు.