వామ్మో పొలిటికల్ "గోపి"లు.. ఎలాంటి స్కెచ్ అంటే..!
హైదరాబాద్ : రేసుగుర్రాల వేట మొదలైంది. ఇక సిట్టింగులకు తలనొప్పి ప్రారంభమైంది. టికెట్ వస్తదో రాదో తెలియక బేజారవుతున్నారు. మున్సిపల్ పోరుకు సిద్దమవుతున్న తరుణంలో కొన్ని సంకేతాలు వారిని కలవరపెడుతున్నాయి. ఈసారి కూడా పోటీకి సై అంటూ లైన్లో నిల్చుంటే.. పార్టీ టికెట్ దడ పుట్టిస్తోంది. వార్డుల సంఖ్య పెరగడంతో పాటు ఆశావహులు పెద్దసంఖ్యలో రంగంలోకి దిగుతుండటం సిట్టింగుల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రధాన పార్టీలు సర్వేలు చేయించుకుంటూ అంగబలం, అర్ధబలం ఉన్న నాయకులపై ఫోకస్ పెట్టాలనుకోవడంతో తమ పరిస్థితి ఏంటని తెగ మధనపడి పోతున్నారు సిట్టింగులు.
పురబరి.. టికెట్లు ఎవరికి మరి..!
పురపాలికల పోరుకు తెరలేచింది. అటుఇటుగా మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదలావుంటే ప్రధాన పార్టీలు మున్సిపల్ పోరుపై లెక్కలేనన్ని ఆశలు పెట్టుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 138 స్థానాలను క్లీన్ స్విప్ చేస్తామంటూ ప్రకటిస్తే.. ఆ పార్టీకి చెక్ పెడతామంటున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఇక అంతో ఇంతో స్థానికంగా బలమైన క్యాడర్ ఉందని చెప్పుకుంటున్న టీడీపీ లీడర్లు సైతం పోటీకి సై అంటున్నారు. ఈసారి తాడోపేడో తేల్చుకుంటామని కొన్ని చోట్ల గట్టిగానే చెబుతున్నారు.
బీసీ మంత్రం జపిస్తున్న జగన్ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట..!
గెలుపు గుర్రాల వేట.. పైసలున్నోళ్లపై దృష్టి..!
అదలావుంటే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి ప్రధాన పార్టీలు. వార్డుల సంఖ్య పెరగడంతో ఆశావహులు పెరుగుతున్నారు. ఆ క్రమంలో అభ్యర్థుల ఎంపిక కొన్నిచోట్ల తలకు మించిన భారమవుతోంది. కొత్తవార్డుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు పార్టీల పెద్దలు. అయితే క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నారు. దాంతో పార్టీల జెండాలు మోసినవారికి టికెట్ దక్కని పరిస్థితులు రావొచ్చు.
సిట్టింగుల్లో టెన్షన్.. టికెట్ కోసం పరేషాన్..!
ఇక సిట్టింగుల టెన్షన్ అంతా ఇంతా కాదు. అధికార పార్టీ నుంచి గెలిచిన చాలామందికి ఈసారి టికెట్లు దక్కే అవకాశం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదలావుంటే సిట్టింగ్ కౌన్సిలర్లపై స్థానికంగా వ్యతిరేకత ఉంటే నిర్దాక్షిణ్యంగా వారిని పక్కకు పెట్టాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు కౌన్సిలర్లు ఆయా పార్టీలకు గుడ్బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అలా కారులోకి జంపైన కౌన్సిలర్లకు ఈసారి పార్టీ టికెట్లు ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు గులాబీ నేతలు. అయితే అదే వార్డులో టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈ ఎన్నికలపై ఎక్కడాలేని ఆశలు పెట్టుకున్నారు. కారు జోరు కారణంగా ఈసారి సునాయాసంగా గెలుస్తామనే ధోరణితో ఉన్నారు. ఆ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లకు గులాబీ టికెట్ ఇస్తే ఎలా అని మధనపడుతున్నారు.
కారు గుర్తుపై ఆశలు.. టికెట్ రాకుంటే గోడ దూకుడేనా?
సర్వేలను బలంగా నమ్మే అధికార పార్టీ టీఆర్ఎస్ పెద్దలు ఈసారి కూడా మున్సిపల్ పోరులోనూ అదే పద్దతి ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బరిలో నిలిచి గెలవాలంటే తమ అభ్యర్థులకు అంగబలంతో పాటు అర్ధబలం కూడా ఉండాలనే పాయింట్తో గెలుపు గుర్రాల వేట ప్రారంభించిందనే టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇదే అంశం సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. అధికార పార్టీ చేసిన అభివృద్ధి పనులతో గెలుపు ఖాయమని ఎన్నెన్నో కలలు కంటుంటే టికెట్ వస్తుందో రాదో తెలియక పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ రాని పక్షంలో అల్టర్నేట్ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
చందమామ చెంతకు చంద్రయాన్ - 2.. మరికొద్ది గంటల్లో నింగిలోకి..!
బీజేపీ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యేనా?
ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ నేతలు ఆ దిశగా దృష్టి సారించారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్లు రాని నేతలకు గాలం వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేగాదు ఆయా వార్డుల్లో అంతో ఇంతో మంచిపేరున్న గల్లీ లీడర్లకు పిలిచి టికెట్లు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది వ్యవహారం. చివరిక్షణంలోనైనా సరే గులాబీ టికెట్ రానివారికి పువ్వు అభయహస్తం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఆ క్రమంలో ఇటు టీఆర్ఎస్లో ఉండి అదృష్టం పరీక్షించుకుంటూనే అటు కమలనాథులతో టచ్లో ఉంటున్నట్లు సమాచారం.
వేరే దారిలో కాంగ్రెస్ పార్టీ..! తెలుగు తమ్ముళ్లు సైతం..!
టీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగులను కదపకుండా.. వారిని డిస్ట్రబ్ చేయకుండా టికెట్లు ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. పోయిన ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచి తర్వాత కారులోకి జంపైన అభ్యర్థుల స్థానాలపై మాత్రం కాసింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక తాము సైతం అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. మొత్తానికి ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా పురపోరు రసవత్తరంగా మారనుందేమో చూడాలి.