డబుల్ బెడ్ రూం పేరుతో మోసం, 169 మంది నుంచి రూ.2 కోట్లు వసూల్, ఆరుగురి అరెస్ట్
మోసం.. మోసం... అమాయకంగా కనిపిస్తే చాలు వంచించడమే. ఏదో ఒక పథకం పేరు చెప్పి చీట్ చేసే కేసులు పెరిగిపోతున్నాయి. కొందరి అమాయకమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న డబుల్ బెడ్ రూం పేరుతో కొందరు మోసం చేశారు. రెండు పడకల ఇళ్లు ఇప్పిస్తామని అందినకాడికి దోచుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.
నమ్మకమే పెట్టుబడి..
దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన వెంకట వరప్రసాద్ వలశెట్టి.. డబుల్ బెడ్ రూం ఇప్పిస్తామని స్కెచ్ వేశాడు. తనతో కొందరినీ చేర్చుకున్నాడు. ఇంకేముందు ప్లాట్ ఇప్పిస్తామని వినియోగదారుల నుంచి నగదు వసూల్ చేశారు. ఎంత ఇవ్వాలని కోరితే అంత మొత్తం డబ్బులను జనం అందజేశారు. కానీ ఎంతకీ ప్లాట్ ఇవ్వకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొందరికీ నకీలీ డాక్యుమెంట్స్ ఇచ్చారు. వాటిని పరిశీలించి తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు.
1.11 కోట్లు రికవరీ..
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంకట వరప్రసాద్ సహా ముఠాను దుండిగల్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఫేక్ డాక్యుమెంట్స్, రూ.1.11 కోట్ల నగదును రికవరీ చేశారు. వరప్రసాద్ సహా ఆరుగురిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం గురించి ఎవరూ చెప్పిన విశ్వసించొద్దని సీపీ సూచించారు.
169 మందికి టోకరా
వరప్రసాద్ అండ్ కో ముఠాకు 169 మంది చిక్కారు. వారంతా ఎంత అడిగితే అంతా నగదు అందజేశారు. రూ.2 కోట్ల వరకు పోగు చేశారు. నిందితుల నుంచి రూ.1.11 కోట్లు రికవరీ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. మిగతా నగదు కూడా స్వాధీనం చేసుకుంటామని.. డబ్బులను బాధితులకు అందజేస్తామని సజ్జనార్ తెలిపారు. డబుల్ బెడ్ రూం పేరుతో ఎవరైనా చెబితే నమ్మొద్దని.. సంబంధిత అధికారులను లేదంటే, పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.