అంగట్లో సరుకులా చిన్నారులు.. 4వేలకే ఆరు నెలల బాలుడి అమ్మకం
హైదరాబాద్ : చిన్నపిల్లల అమ్మకం అంగట్లో సరుకులా మారింది. చిన్నారులను ఎత్తుకెళుతున్న ముఠాలతో పాటు ఆర్థిక అవసరాల కోసం తల్లిదండ్రులు పిల్లల్ని అమ్ముతున్న వైనం రోజుకో చోట వెలుగుచూస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యాచకురాలు కేవలం 4 వేల రూపాయలకు చిన్నారిని అమ్మడం కలకలం సృష్టిస్తోంది.
నిజామాబాద్ జిల్లా వర్షి మండలం మున్సాపూర్కు చెందిన 40 ఏళ్ల ప్రసాద్ హైదరాబాద్లో పనిచేస్తూ లంగర్హౌజ్లో నివాసముంటున్నారు. అయితే అతనికి ఇద్దరు కుమార్తెలున్నారు. కొడుకు కావాలనే కోరిక బలంగా ఉన్న ప్రసాద్.. నిజామాబాద్ కు వెళ్లిన సందర్భంలో అక్కడ ఓ యాచకురాలి నుంచి 4వేల రూపాయలకు ఓ బాలుడ్ని కొనుగోలు చేశాడు.
Recommended Video
దివ్యాంగుడే.. కానీ రాక్షసుడు.. ప్రకాశం జిల్లా గ్యాంగ్రేప్ కేసులో సంచలన నిజాలు
శనివారం రాత్రి నిజామాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో ప్రసాద్ అక్కడి బస్టాండ్ సమీపంలో నిద్రించాల్సి వచ్చింది. అయితే మరునాడు ఆదివారం బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో యాచకుల దగ్గర చిన్నారులు ఉండటం గమనించాడు. అందులో ఆరు నెలల బాలుడు తనకు కావాలంటూ అడగడంతో ఓ యాచకురాలు 10 వేల రూపాయలు అడిగిందట. దాంతో ఆయన బేరమాడి 4 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
అలా ఆ బాబును తీసుకుని నేరుగా హైదరాబాద్కు బయలుదేరాడు ప్రసాద్. ఆదివారం నాడు నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు న్యూబోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస్స్టాప్లో దిగాడు. అయితే ప్రసాద్ అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఏఎస్ఐ వీరయ్య అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.
ప్రసాద్ పై కేసు నమోదు చేసి అతడికి బాలుడిని అమ్మిన యాచకురాలి కోసం గాలిస్తున్నారు పోలీసులు. సదరు బాలుడిని యూసుఫ్గూడలోని శిశువిహార్కు తరలించారు. అయితే ప్రసాద్ చెప్పిన కథ నిజమేనా.. లేదంటే కట్టుకథ అల్లాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. పిల్లలను అపహరిస్తూ వారిని అమ్మి సొమ్ము చేసుకునే ముఠాతో లింకులున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.