ఈసారి కూడా వరుణిడి కరుణ లేదా!.. వర్షాలు తక్కువేనా?..
హైదరాబాద్ : తెలంగాణను ఈసారి కూడా వరుణుడి కరుణించేట్లు కనిపించడం లేదు. గతేడాది కూడా సరైన వర్షపాతం నమోదుకాకపోవడంతో గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది. ఆ పర్యవసానం తాలూకు ఈ ఏడాది మార్చి మొదటివారం నుంచే పలుచోట్ల నీటి ఎద్దడి ఏర్పడింది. అయితే ఈసారి కూడా తెలంగాణలో సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపింది వాతావరణం అంచనా వేసే స్కైమెట్ సంస్థ. ఎల్నినో గండం పొంచి ఉండడమే దీనికి కారణమంటోంది.
గతేడాది తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదైంది. సరైన సమయంలో వర్షాలు పడక అన్నదాతలు కుదేలయ్యారు. పోయినేడాది లాగే ఈసారి కూడా వర్షాలు సరిగా పడవని చెబుతోంది స్కైమెట్. నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం చూపితే.. ఈ సంవత్సరం కూడా సాధారణం కన్నా తక్కువ వర్షాలు పడతాయనేది స్కైమెట్ అంచనా.
లోటు వర్షపాతం..!
హైదరాబాద్ వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం.. 2018లో తెలంగాణలోని మధ్య, దక్షిణ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సాధారణ వర్షపాతం 759.2 మిల్లిమీటర్లు కాగా.. 742.4 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 2 శాతం లోటన్నమాట. అయితే ఈ ఏడాది ఇప్పుడప్పుడే రుతుపవనాల ప్రభావం అంచనా వేయలేమని.. భారత వాతావరణ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాతనే కచ్చితంగా అంచనా వేయొచ్చని చెబుతున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.
హైదరాబాద్ లో 29 శాతం లోటు.. కొన్ని జిల్లాల్లో దారుణం
గతేడాది వర్షపాతం చూసినట్లయితే సంగారెడ్డి, మేడ్చల్, గద్వాల తదితర జిల్లాల్లో పరిస్థితి దారుణంగా కనిపించింది. సాధారణవర్షపాతంలో సగం కూడా వానలు పడలేదు. ఇక హైదరాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ అధ్వాన్నం. 29శాతం లోటు ఏర్పడటం గమనార్హం. పోయిన సంవత్సరం జూన్ 8వ తేదీన రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు అదేరోజున రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దాంతో వర్షాలకు డోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళనకు గురిచేసింది. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని సంబరపడ్డ రైతన్నలకు చివరికి చేదు అనుభవమే మిగిలింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురిసిన వానలు అన్నదాతల ఆశలపై నీళ్లు జల్లాయి.
ఎల్నినో ఎఫెక్ట్.. వరుణిడి దయ
ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదవుతుందని వెల్లడించింది స్కైమెట్. మే నుంచి జులై వరకు 3 నెలల పరిస్థితి చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడటానికి దాదాపు 60 శాతం ఛాన్సుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దాంతో దేశంలోని తూర్పు, మధ్య భాగాల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముంది. ఆ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉండే ఛాన్సుందని చెబుతున్నారు.