స్మార్ట్ఫోన్లతో ఒక్కొక్కరు రోజుకి ఎన్ని గంటలు వృధా చేస్తున్నారో తెలుసా?
హైదరాబాద్ : టెక్నాలజీ పెరిగింది. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరింది. గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే చాలు.. ఏ సమాచారమైనా ఇట్టే క్షణాల్లో దొరికిపోతుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. అందివచ్చిన సాంకేతికతను సరైన మార్గంలో వినియోగించుకోవాల్సింది పోయి.. స్మార్ట్ఫోన్లతో ఛాటింగ్స్, ఛీటింగ్స్ చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటోంది యువతరం. అవసరమైన విషయాలకంటే అనవసర విషయాల వైపే మొగ్గుచూపుతోంది. సోషల్ మీడియా వేగం పుంజుకుంటున్న తరుణంలో అది లేనిదే తమ జీవితం లేనట్లుగా తయారైంది పరిస్థితి.
ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మంది తమ విలువైన సమయం వృధా చేసుకుంటున్నారని చెబుతున్నారు ఇండ్ థింక్ ట్యాంక్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు కుంతలేశ్వర్ రావు. రోజుకు 3 గంటలు స్మార్ట్ఫోన్లలో మునిగితేలుతున్నారని చెప్పుకొచ్చారు. శనివారం నాడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ మూడు గంటలు అలా స్మార్ట్ఫోన్లలో వృధా చేసే బదులు వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు.
స్మార్ట్ఫోన్లతో అలా గంటలు గంటలు కుస్తీ పట్టే యువతకు పలు సూచనలు చేశారు కుంతలేశ్వర్ రావు. స్మార్ట్ఫోన్లతో అలా సమయం వృధా చేసే బదులు.. అదే సమయం తమకు కేటాయిస్తే వారికి కావాల్సిన విషయం పరిజ్ఞానం అందించేందుకు రెడీగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుందని.. అది బయటకు తెచ్చుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు. ఇలాంటి యువతను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇండ్ థింక్ ట్యాంక్ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించిందని చెప్పారు. యువతరంలో నిక్షిప్తమైన ఇంటలెక్చువల్, డైనమిక్ లక్షణాలు వెలికితీయగలిగితే.. దేశంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అడుగు ముందుకుపడుతుందని చెప్పుకొచ్చారు.