హైదరాబాదీల పొల్యూషన్ కష్టాలకు సొల్యూషన్ ..ఆ డీజిల్ వాహనాలు బ్యాన్? .. సీఎం కేసీఆర్ నిర్ణయం
భాగ్యనగర వాసుల పొల్యూషన్ సమస్యకు సొల్యూషన్ చూపించాలని భావిస్తుంది తెలంగాణా సర్కార్. మెట్రో నగరాల్లో పెరుగుతున్న వాహనాల రీత్యా విపరీతమైన వాయు కాలుష్యం పెరుగుతుంది . దీంతో భాగ్యనగర్ లో గాలిలో ప్రమాదకర వాయువుల శాతం పెరుగుతుంది. ఇక ప్రజలు రోడ్లపైకి రావాలంటే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ వాతావరణ కాలుష్యాన్ని కాస్తైనా తగ్గించాలని భావిస్తున్న తెలంగాణా సీఎం కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు.
Recommended Video
కాలుష్య నివారణా చర్యలు చేపట్టాలని సర్కార్ నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతుంది. అక్కడ మానవ జీవనం డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తుంది . ఇక హైదరాబాద్ లో కూడా బాగా వాహనాలు పెరిగి వాయు కాలుష్యం పెరుతున్న నేపధ్యంలో మరో ఢిల్లీ లా హైదరాబాద్ మారకుండా ఉండటం కోసం ఇప్పటి నుండే కాలుష్య నివారణా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్ . అందులో భాగంగానే రవాణాశాఖకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
డీజిల్ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం
ఇక తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా ఈ కాలుష్యం , పెరుగుతున్న వాహనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కేసీఆర్ వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హైదరాబాద్లో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వాహనాల పొగతో నగరం వాయు కాలుష్యంతో ప్రమాదపుటంచుల్లోకి చేరుకోకముందే మొక్కలు పెంచడంతో పాటుగా డీజిల్ వాహనాలను సైతం నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టాలని అధికారులకుఆదేశాలు జారీ చేశారు . వాహనాల సంఖ్య బాగా పెరగకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించే యోచన
అందులో భాగంగా 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించడానికి వీలుగా ఉన్న అంశాలపై విశ్లేషణ జరపాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. డీజిల్ వాహన విక్రయాలు తగ్గేందుకు ఫోకస్ చేయాలని చెప్పినట్టుగా కూడా సమాచారం . డీజిల్ వాహనాలపై మరింత అధిక పన్నును వసూలు చేయాలని అదే సమయంలో అటు ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోళ్లను కూడా పెంచేందుకు కూడా ప్లాన్ చెయ్యాలని చెప్పినట్టు తెలుస్తుంది .బ్యాటరీ వాహనాలపై పన్ను మినహాయింపు ఇస్తే కొనుగోళ్ళు పెరిగి ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ఆలోచన అమలులోకి వస్తే డీజిల్ వాహనదారులకు తిప్పలు మొదలయినట్టే మరి.