సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తొలగింపు! ఎక్కడ.. ఎందుకంటే..?
రిజిష్ట్రేషన్ శాఖపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రిజిస్ట్రేషన్లు తక్కువ జరిగే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను తొలగించాలని భావిస్తోంది. ఆ ఆఫీసులను డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్టర్ అయ్యే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. దీనికోసం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. త్వరలో సీఎం కేసీఆర్ అనుమతితో పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులను జారీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇక నుండి నిలదీతల పర్వమే .. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే .. బండి సంజయ్ ధ్వజం
పెద్దగా పని లేకపోవడంతో..
రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ బాధ్యతలను అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల కంటే ఎక్కువగా వ్యవసాయ పట్టా భూములే రిజిష్ట్రేషన్ అవుతుంటాయి. గ్రామీణ ప్రాంత ఎస్ఆర్ కార్యాలయాలు ఇప్పటివరకు రిజిస్టర్ చేస్తూ వచ్చాయి. వ్యవసాయ పట్టా భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగిస్తుండడంతో అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాయాలకు పని లేకుండా పోతుంది. దీంతో ఆ కార్యాలయాలను తొలగించి, అందులో గల సబ్-రిజిస్ట్రార్లు, సిబ్బందిని అవసరమున్న చోట మార్చాలని భావిస్తున్నారు.
20 కార్యాలయాల వరకు తరలింపు..?
రాష్ట్రంలో 141 సబ్ రిజిష్ట్రర్ కార్యాలయాలు ఉండగా.. కనీసం 20 కార్యాలయాలను తొలగిస్తారని తెలుస్తోంది. అయితే వాటిని అవసరం ఉన్న చోటకు మారుస్తారు. మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలను తగ్గించే అవకాశం ఉంది. వీటిని మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మారుస్తారు. దీంతో ఇక్కడున్న వారికి పని ఒత్తిడి తగ్గనుంది. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కార్యాలయాలను విభజించి.. కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. సమీపంలో గల రెవెన్యూ మండలాలను కలిపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.
Recommended Video
ముమ్మరంగా కసరత్తు..
సబ్ రిజిష్ట్రర్ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, స్టాంపు రిజిస్ట్రేషన్ల ఐజీ చిరంజీవులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. దీంతోపాటు చాలా రోజుల నుంచి ఒకే చోట పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తారని సమాచారం. మూడేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి బయటపడిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్లో ఇలాంటి ఘటనలకు తావులేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందుకే తొలుత ఎస్ఆర్, సీనియర్ అసిస్టెంట్లను ట్రాన్స్ఫర్ చేయాలని భావిస్తున్నారు.