ఆ తెలంగాణ పల్లెలు 'ఓటు'కు దూరం.. ఎందుకో తెలుసా?
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో కొన్ని పార్లమెంటరీ సెగ్మెంట్లలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు రిలీజ్ చేసిన ఓటింగ్ శాతం ఆయా పార్టీల నేతలను కలవరానికి గురిచేసింది. అదలావుంటే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు.. ఎన్నికలకు దూరంగా ఉండటం చర్చానీయాంశమైంది. ఉదయం నుంచి ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి విషయం అడిగారు. వారు చెప్పిన సమాధానంతో కంగుతినడం వీరి వంతైంది.
సీఎం కేసీఆర్ ఇలాకా మెదక్ జిల్లాలో అవుసుల పల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తారా అంటు ఆగ్రహంతో ఉన్నారు. ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితే తమకు నష్టం జరుగుతుందనేది వారి వాదన.
నారాయణపేట జిల్లాలోనూ మరికల్ మండలం తిలేరు గ్రామ ప్రజలు ఓటింగ్ ను బహిష్కరించారు. బుధవారం (10.04.2019) నాడు మట్టిదిబ్బలు విరిగిపడి ఏకంగా 10 మంది కూలీలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి గ్రామస్థులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇక వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ ఇదే తంతు. అనంతగిరి పల్లి తాండాకు చెందిన ఓటర్లు ఎన్నికల సంగ్రామానికి దూరంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తాగునీటి సమస్య తీర్చితే గానీ ఓట్లు వేయబోమంటూ తీర్మానించారు.