సోనియా సభ విజయవంతం..! కూటమి నేతల స్పూర్తి దాయక ప్రసంగాలు..! ఎవరేమన్నారంటే..!!
Recommended Video
హైదరాబాద్: సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సభ విజయవంతం అయినట్టే చెప్పుకోవాలి. లక్షలాదిగా జనం తరలి రావడంతో ప్రజా కూటమి పార్టీల్లో జోష్ పెరిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, తాను ఎదుర్కొన్న మానసిక వేదన, ఏపీ కి ప్రత్యేక హోదా అంశాలపై సోనియా ప్రసంగించిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించింది. తల్లి, కొడుకు రాక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. మేడ్చల్ సభతో కాంగ్రెస్ కార్యకర్తలకు మరింత ఊత్సాహం, ఊపునిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ ఎన్నికలకు ముందు మేడ్చల్ బహిరంగ ఒక చారిత్రకంగా మిగిలిపోనున్నది. సుమారు మూడు లక్షల మంది సభకు హాజరై ఉంటారని నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇక సభలో పాల్గొన్న కూటమి నేతలు సూటిగా సూక్షంగా ప్రసంగించి పలువురిని ఆకట్టుకున్నారు.
ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పారిపోతారు..! ఉత్తమ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అదికార పార్టీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మేడ్చల్ కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన కేసీఆర్ పై పదునైన విమర్శలు చేశారు. ఉత్తమ్ విమర్శలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఈలలు వేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ భ్రష్టు పట్టించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఘోరీ కట్టాలి. బొంద పెట్టాలి'' అని ఘాటుగా విమర్శించారు. రాబోయే ప్రభుత్వంలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. కేసీఆర్ మాట్లాడుతున్న పిచ్చి పిచ్చి మాటలను ఖండిస్తున్నాం. 99 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎవరో రాబోయే వారు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావితం చేస్తారని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ బిల్లులో ఉన్న కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును, గిరిజన యూనివర్సీటిని ప్రధాని దగ్గర మంజూరు చేయించని సన్నాసి, దద్దమ్మ కేసీఆర్ అని మండి పడ్డారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ఫాం హౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పారిపోతారని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని దివాలా తీయించారు..!! ఉద్యమకారులను కేసీఆర్ అణగదొక్కాడు..! రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి : మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారన్నారు. ఆరు దశాబ్ధాల పోరాటాన్ని చూసి, ఆత్మ బలిదానం చేయకూడదని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, కేసీఆర్ తన 52 నెలల పరిపాలనలో ప్రజలను అష్టకష్టాలు పెట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యమం కోసం ఎవరైతే పోరాడారో ఆ వర్గాల వారికి విశ్వాసం కల్పించడానికి సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చారని గుర్తుచేసారు. ఓడిపోతే ఫాం హౌస్ పోతానని కేసీఆర్, కేటీఆర్ అమెరికా వెళ్తారని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ దుర్మార్గమైన పాలనను ప్రజలందరూ పారద్రోలాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.
ఇంటికో ఉద్యోగం కాదు కదా.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. ! కోదండ రాం..!!
కోదండరాం... కాంగ్రెస్ బహిరంగ సభలో టీజేఎస్ అధినేత ఎం. కోదండరామ్ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన సోనియా కు ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు సభలో ఎన్ని ఇబ్బందులు కలిగాయో మాకు తెలుసు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇసుక మాఫియాను ఆపినందుకు దళితులను కొట్టారు. రేషన్ డీలర్లను కాపాడాలని కోరినా పట్టించుకోలేదు. మహిళలకు పావలా వడ్డీ కూడా దక్కలేదు. రైతు రుణ మాఫీ బ్యాంకులో పడగానే బ్యాంకులు మళ్లీ తీసుకున్నాయి. నాలుగున్నరేళ్ల పాలన నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన చేశారు. ఓటు వేసినా ఫాం హౌస్, వేయకపోయినా ఫాం హౌస్ కే కేసీఆర్ పరిమితం అవుతున్నందున టీఆర్ఎస్ కు ఓటు వేయవద్దన్నారు. నిరంకుశ పాలన అంతం చేసేందుకు కూటమి ఏర్పాటు చేశాం, ప్రతి ఒక్కరికి మేలు జరిగేందుకు ఒక్కటయ్యామన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు వెదజల్లుతోందని, తమ దగ్గర అంత సొమ్ము లేదని కోదండరామ్ అన్నారు.
దళితుడిని ముఖ్మమంత్రి ఎందుకు చేయలేదు.. గడీల పాలన అంతం కావాలి..! రమణ.
యల్ రమణ --దళితుడే సీఎం అని చెప్పిన దొర తానే సీఎం గా కూర్చున్నార టీ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. మేడ్చల్ సభలో ఆయన మాట్లాడుతూ, 51 నెలల దొర పాలనలో ఆత్మగౌరం దక్కలేదు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ముందుకు వచ్చింది. ధనిక రాష్ట్రం దోపిడి కావడం మూలంగా దివాలా తీసింది. ప్రజా కూటమిని ఆశీర్వదించాలి, దీవించాలి. ఈ కూటమి భారతదేశానికి ఆదర్శం కావాలి. 2019లో ప్రజా కూటమి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు రమణ.
కుటుంబ పాలన తప్ప ప్రజా సంక్షమం లేదు.. చాడా వెంకటరెడ్డి..!
చాడా వెంకట రెడ్డి... ఆంధ్ర లో నష్టమైనా పర్వాలేదని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోనియా పుణ్యంగా తెలంగాణ వచ్చిందిని, ఈ రోజు కుటుంబ పాలన, గడీల పాలన జరుగుతోందని. కూటమి ప్రజల విశ్వాసం పొందుతున్నారని అన్నారు. కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని కేసీఆర్ అన్ని రకాలుగా రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
ప్రత్యేక పాటతో గద్దర్ ఆకర్షణ..! భార్య, కొడుకుతో సోనియాని సన్మానించిన ప్రజా గాయకుడు..!!
గద్దర్ .. ప్రత్యేక తెలంగాణ ను ప్రసవింప చేసిన తల్లి సోనియా గాంధీకి వందనం అని ప్రజా గాయకుడు గద్ధర్ కొనియాడారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభా వేదికగా గద్దర్ పాట పాడి ప్రసంగించారు. పాలకుల చేతుల్లో పెడితే పాలించకుండా ఎండబెట్టారు. ఆ పసిగుడ్డును పెంచేందుకు వచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు అంటూ గద్దర్ కీర్తించారు. అంతకు ముందు నటి విజయశాంతి, రేణుకా చౌదరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఉస్మానియా విద్యార్థులు సన్మానం చేశారు. అలాగే గద్దరు తన భార్య విమల, కుమారుడు క్రాంతితో కలిసి సోనియా ను సన్మానించారు.
ఆర్ క్రిష్ణయ్య తో పాటు పలువురి నేతల ప్రసంగం..!!
అంతే కాకుండా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు కాని ఊరికి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపిచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కుటంబం రాష్ట్రంలో అందరిని బానిసలుగా చూస్తున్నారు. ఆత్మబలిదానాలు చేసుకుంది బర్రెలు, గొర్రెల కోసం కాదు. అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాగాంధీ కి బహుమానం ఇవ్వాలి అని అన్నారు. గజ్వేల్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి ని గెలిపించి కేసీఆర్ కు బుద్ది చెప్పాలని వెంకట్ రెడ్డి అన్నారు.