అయ్యప్ప మాల వేసే పోలీసులకు ప్రత్యేక అనుమతులు కుదరవు.. రాచకొండ సీపీ మహేష్ భగవత్
అయ్యప్ప మాల వేసుకునే పోలీస్ సిబ్బందికి విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. అయ్యప్ప మాల వేసుకోవాలనుకునే పోలీసు సిబ్బంది రెండు నెలల పాటు సెలవుపై వెళ్లిపోవాలని సూచించిన హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అనుమతులు ఇవ్వడంలో గల ఇబ్బందిని వివరించారు. విధుల్లో ఉన్న వారు తప్పని సరిగా యూనిఫాం, షూ ధరించి హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
యూనిఫాం,షూ లేకుండా పోలీసులు విధులు నిర్వహించడం కష్టమన్న సీపీ
యూనిఫాం,షూ లేకుండా పోలీసులు విధులు నిర్వహించడం కష్టమని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన పోలీసు శాఖలో గడ్డాలు, మీసాలు పెంచి, విధులు నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు.పోలీసు శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. దీక్ష తీసుకోవాలనుకుంటున్నవారు దీక్షాకాలంలో సెలవుపై వెళ్లాలని సూచించారు. అంతే తప్ప ప్రత్యేక అనుమతులు సాధ్యంకాదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ తరహా అనుమతి కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవద్దని ఆయన డి సి పి లు, ఏసీపీలు, ఎస్ హెచ్ వో లకు ఆదేశాలు జారీ చేశారు.
అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్న అయ్యప్ప దీక్షాపరులు
అయ్యప్ప దీక్ష అతి కఠినమైన దీక్ష కావడంతో.. ఆ దీక్ష తీసుకునే పోలీసులు ఆ సమయంలో దీక్షలో ఆచరించే నియమాల కారణంగా పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటుంటారు.ఇందుకు సంబంధించి ఈ ఏడాది కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీస్ సిబ్బంది అధికారుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
క్రమశిక్షణ ఉన్న పోలీస్ శాఖలో అనుమతులు సాధ్యం కాదన్న సీపీ
అయితే ఆ దరఖాస్తును పరిశీలించి సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక అనుమతులు సాధ్యం కాదన్నారు. ప్రధాన కార్యాలయం జారీ చేసిన మెమో నెం. 987/ఈ3/2011 ప్రకారం యూనిఫాం, షూ లేకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదని అన్నారు.అయ్యప్ప మాల వేసుకున్న పోలీసు సిబ్బంది ఉన్నతాధికారుల అనుమతితో షూ వేసుకోకుండా విధులు నిర్వహిచడం పరిపాటి. ఇప్పటివరకు ఎప్పుడూ పోలీస్ సిబ్బంది అయ్యప్ప మాల వేసుకుంటే అనుమతులు ఎప్పుడూ నిరాకరించలేదు.
సీపీ నిర్ణయంపై పోలీసు వర్గాల్లో చర్చ .. హిందూ సంఘాల అసహనం
కానీ తాజాగా మహేశ్ భగవత్ అవసరమైన వారు సెలవుపై వెళ్లాలని ప్రత్యేక అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయ్యప్ప మాల వేసుకొని అన్ని శాఖల్లోని విధులు నిర్వర్తించే ఉద్యోగులున్నా, ఒక పోలీసు శాఖలో అయ్యప్ప మాల వేసుకుని విధులు నిర్వర్తించడం కుదరదని చెప్పడంతో చర్చ జరుగుతోంది. సీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి .