అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!
హైదరాబాద్ : అత్యాచార బాధితులంటే సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిపై సానుభూతి చూపడం మాట అటుంచితే.. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సూటిపోటి మాటలతో ఇరుగుపొరుగు వారు చూపే నరకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదంతా ఒక ఎత్తైతే, తమ జీవితాన్ని చిధ్రం చేసిన కామాంధులకు తగిన శిక్ష వేయించేందుకు జరిపే న్యాయపోరాటంలో ఎదుర్కొనే సవాలెన్నో. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏళ్లకేళ్లు గడిచిపోయాయి. ఇలా నిత్యం నరకం అనుభవించే అత్యాచార బాధితులకు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చారు తెలంగాణ పోలీసులు. నాలుగు నెలల్లోనే రేప్ నిందితులకు శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇస్తున్నారు.
విజయ్ మాల్యాకు షాక్: బెంగళూరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు
అత్యాచార బాధితుల కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్
అత్యాచార బాధితులకు ఊరటనిచ్చేలా, నిందితులకు సత్వర శిక్షలు పడేలా చూసేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి కార్యాచరణ మొదలుపెట్టింది. డీఎస్పీ నేతృత్వంలో 15 మంది సిబ్బందితో ఏర్పాటైన టాస్క్ఫోర్స్.. రాష్ట్రవ్యాప్తంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులపై ప్రత్యేక దృష్టి సారించనుంది. కేసు బుక్ అయిన రెండు నెలల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు మరో రెండు నెలల్లో న్యాయ విచారణ పూర్తయ్యేలా టాస్క్ఫోర్స్ చర్యలు తీసుకోనుంది. అలసత్వం ప్రదర్శించి నిర్ణీత సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలను సిఫార్సు చేయనుంది. లక్డీకాపూర్ లోని భవనంలో మహిళా దినోత్సవం నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తున్న ఈ టాస్క్ఫోర్స్.. నాలుగు నెలల్లో న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు ధైర్యం చెబుతోంది.
ఏళ్లకేళ్లు సాగుతున్న విచారణ
స్వరాష్ట్రం సిద్ధించాక మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే షీ టీంలు, భరోసా కేంద్రాల ఏర్పాటుతో పాటు పలు చర్యలు తీసుకుంటోంది. ఐజీ స్వాతిలక్రా నేతృత్వంలో మహిళ భద్రత కోసమే ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. వాస్తవానికి అత్యాచారం కేసుల్లో దర్యాపు, విచారణకు ఏళ్లకేళ్లు పడుతోంది. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగలేక బాధితులు విసిగిపోతున్నారు. ఇదే అదునుగా నిందుతులు బాధితులను, సాక్షులను బెదిరించి, భయపెట్టి కేసులు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. ఈ కారణంగానే రేప్ కేసుల్లో శిక్షలు రెండు శాతానికి మించడంలేదు. ఈ నేపథ్యంలో సత్వర న్యాయ విచారణ పూర్తైతే శిక్షల శాతం పెరుగుతుందన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు అత్యాచార కేసుల్లో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు మహిళా భద్రత విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.
అత్యాచార కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగం
అత్యాచార కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. సీసీటీఎన్ఎస్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న రేప్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కేసు బుక్ అయినప్పటి నుంచి దర్యాప్తును నితంతరం పర్యవేక్షిస్తూ రెండు నెలల్లో చార్జ్షీట్ దాఖలు చేసేలా చూస్తోంది. సిబ్బంది రెండు నెలలలోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడంలో విఫలమైతే వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. కేవలం ఛార్జ్షీట్ దాఖలుతోనే తమ పనైపోయిందని అనుకోకుండా న్యాయవిచారణ కూడా రెండు నెలల్లో పూర్తయ్యేలా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. బాధితులకు న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు సాక్ష్యులు న్యాయస్థానాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది. రెండు నెలల అనంతరం ఫలితాలను విశ్లేషించనున్న అధికారులు దాని ఆధారంగా టాస్క్ఫోర్స్ పనితీరును మరింత మెరుగుపరచనున్నారు.