ఒక్క రోజు ముందే సీతారాముల కల్యాణం!.. రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
Recommended Video
హైదరాబాద్ : శ్రీరామ నవమి వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అటు భద్రాద్రి రాములోరి గుడిలో సీతారాముల కల్యాణం ఆదివారం (14.04.2019) నాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదలావుంటే వేములవాడలో ఒక్కరోజు ముందు అంటే శనివారం (13.04.2019) నాడే సీతారాముల కల్యాణం నిర్వహించారు.
ఓటరన్నకు కోపమొచ్చిందా?.. పోలింగ్ శాతం భారీగా ఎందుకు తగ్గింది?
ఆనవాయితీ
శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం (14.04.2019) నాడు రాష్ట్రమంతటా ఘనంగా జరగనున్నాయి. అయితే ఒకరోజు ముందే దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య జానకీరాముల వివాహ వేడుక కనులపండువగా జరిగింది.
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచ ఉపనిషత్ ద్వారా అభిషేకం, శివపార్వతులకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సేవలు అందించారు. రాములోరి లగ్గం చూసేందుకు భక్తజనులు పోటెత్తారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని.. రఘురాముడికి, శివుడికి సమాంతరంగా పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
యాదాద్రిలో నవమి వేడుకలు
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలోనూ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో శనివారం నాడు యాదాద్రి క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాములోరి లగ్గానికి రెడీ
శ్రీరామ నవమి పురస్కరించుకుని అటు భద్రాద్రి ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం ఆదివారం (14.04.2019) నాడు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అలాగే సోమవారం (15.04.2019) నాడు రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు. భద్రాద్రి రాములోరి గుడి విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది.