సుమేధా మృతి ఘటనలో సంచలనం - నేరపూరిత హత్య - మంత్రి కేటీఆర్పై పాప తల్లిదండ్రుల ఫిర్యాదు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 12 ఏళ్ల బాలిక సుమేధా కపూరియా మృతి ఘటనలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నేరెడ్మెట్లోని కాకతీయ నగర్లో ఈనెల 17న సుమేధా ఓపెన్ నాలాలో పడి చనిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్ ఆరోపించారు. తమ కూతురి మరణానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సుమేధా మృతితో కదిలిన సర్కార్ - అంతటా ఓపెన్ నాలాల మూసివేత - కేటీఆర్ కీలక ఆదేశాలు
మంత్రి కేటీఆర్ కూడా బాధ్యుడే..
సైకిల్ పై ఆడుకుంటోన్న సుమేధా.. ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోయి.. సమీపంలోని బడచెరువులో మృతదేహంగా తేలడం స్థానికంగా అందరినీ కలచివేసింది. జాతీయ మీడియాలోనూ ఈ వార్త ప్రముఖంగా ప్రసారమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఆరోపిస్తోన్న తల్లిదండ్రులు.. అందుకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలు బాధ్యత వహించాలని, వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
భగ్గుమన్న రైతులు:మోదీ బొమ్మ దహనం - రాష్ట్రపతికి 15 పార్టీల లేఖ - 24న కాంగ్రెస్ నిరసనలు -ఉత్తరాన హీట్
నేరపూరిత హత్య..
నెరేడ్ మెంట్ పోలీసులకు సుమేధా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సహా తాము నిందితులుగా భావిస్తోన్న అందరిపై ఐపీసీ సెక్షన్ 304(నేరపూరిత హత్య) కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 304కింద నమోదైన కేసులో నిందితులు నేరం చేసినట్లు రుజువైతే జీవితఖైదు లేదా పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉండటం గమనార్హం. అయితే, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. మంత్రి, మేయర్, జీహెచ్ఎంసీ సిబ్బందిపై కేసు నమోదు చేసింది లేనిది ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
Recommended Video
పనులు చేయనప్పుడు పన్నులు ఎందుకు?
సుమేధా మృతిని ప్రమాదంగా భావించడం కంటే ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే సుమేధ బలైపోయిందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఓపెన్ నాలా కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని, అభివృద్ధి చేయలేనప్పడు ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారని సుమేధ తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలపై సోమవారం రివ్యూ నిర్వహించిన మంత్రి కేటీఆర్.. అన్ని ఓపెన్ నాలాలను మూసేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. సుమేధా తల్లిదండ్రుల ఫిర్యాదుపై ప్రభుత్వ సస్పందన వెలువడాల్సిఉంది.