బాబోయ్ ఎండలు .. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Recommended Video
హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇక రానున్న రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం జనాలను వెంటాడుతోంది. టెంపరేచర్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఉక్కపోత తీవ్రమవుతోంది. మార్చి చివరినాటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముండటంతో జనాలు భయందోళనలు చెందుతున్నారు.
మండే ఎండలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాడు ఎండ వేడిమి అధికంగా ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో 39.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఒడ్డెమానులో 39.7 డిగ్రీలు, తొండకూరులో 39.6 డిగ్రీలు, బయ్యారం, పెబ్బేరు ప్రాంతాల్లో 39.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్ లో శనివారం పగటి పూట టెంపరేచర్ 37.2 డిగ్రీలుగా నమోదైంది. అదే రాత్రిపూట 23-24 డిగ్రీలుగా రికార్డవుతోంది. అయితే మార్చి చివరినాటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. టెంపరేచర్ అత్యధికంగా 40 డిగ్రీలకు చేరే ఛాన్సుందని చెబుతున్నారు. మార్చి చివర్లోనే 40 డిగ్రీలకు చేరితే.. ఏప్రిల్, మే నెలల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎండాకాలం తట్టుకోవడం కష్టమే అనే రీతిలో జనాల్లో టాక్ నడుస్తోంది.
రాష్ట్రంలో అప్పుడే భానుడి భగ భగలు ... ఎండలతో జనం విల విల
అందుకేనా హై టెంపరేచర్..!
దక్షిణాదిపై వాతావరణ ప్రభావం కారణంగా తెలంగాణలో టెంపరేచర్ పెరుగుతోందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు. తుపాను వ్యతిరేక గాలుల చక్రం ఏర్పడటంతోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్పారు.
విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో.. నల్గొండ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ అధికంగా ఉంటోందని వివరించారు. దీంతో సోమవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.