తెలంగాణ టపాసుల వ్యాపారులకు ఊరట: బాణసంచాకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్, కానీ..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణలో బాణసంచా వ్యాపారులకు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో బాణసంచా కాల్చేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రెండు గంటలపాటు టపాసులు కాల్చేందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పర్యావరణ హితమైన(గ్రీన్ క్రాకర్స్) టపాసులు మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక, గాలి నాణత్య సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు జస్టిస్ ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
నవంబర్ 9న జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గాలి నాణ్యత సాధారణంగా ఉన్న చోట రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ అనుమతించింది. తెలంగాణలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట టపాసులపై నిషేధించింది.
ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణలో టపాసులపై ఆంక్షలు విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణలో టపాసుల అమ్మకాలు, కాల్చడంపై విధించిన రాష్ట్ర హైకోర్టు నిషేధంపై సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతకుముందు పరిణామాలు..
తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిసేధం విధించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో నిషేధం విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాణసంచా నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బాణసంచా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము అప్పులు చేసి లక్షల రూపాయల టపాసులు తెచ్చామని, ఇలా హఠాత్తుగా నిషేధం విధిస్తే తాము ఏం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాణసంచా వ్యాపారులు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.