హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు లాస్ట్ ఛాన్స్ - సుప్రీం కోర్టు తీర్పు : కండీషన్స్ అప్లై..!!
వినాయక చవితి ఉత్సవాలు...నిమజ్జన మహోత్సవం ప్రతీ ఏటా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కరోనా కారణంగా నిర్వహించ లేదు. ఈ సారి నిమజ్జనం పైన న్యాయ పరమైన చిక్కులు మొదలయ్యాయి. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర ఆఫ్ ఫ్యారీస్ తో చేసిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయటానికి తెలంగాణ హై కోర్టు ససేమిరా అంది. తొలుత నో అన్ని చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది.
అయినా..హైకోర్టు తాము అంతకు ముందే ఇచ్చిన తీర్పులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దీంతో..ప్రభుత్వంతో పాటుగా ఉత్సవ నిర్వాహకులు సైతం డైలమాలో పడ్డారు. హుస్సేన్ సాగర్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో విగ్రహాల నిమజ్జనం ఏ రకంగా సాధ్యమనే అంశం పైన తర్జన భర్జన లు చేసారు. దీని పైన కొన్ని సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాయి. దీంతో....ప్రభుత్వం హై కోర్టు తీర్పు పైన సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వాదనలు పూర్తయిన తరువాత హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అదే విధంగా విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే తొలిగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. నిమజ్జనం కు సంబంధించి తీసుకున్న చర్యలను నివేదించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Recommended Video
వచ్చే ఏడాది నుంచి మాత్రం పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో.. మరో నాలుగు రోజుల్లో జరగనున్న నిమజ్జన ఉత్సవం ముందు ఈ తీర్పు ప్రభుత్వానికి ఊరటగా భావించవచ్చు. ఇక, వచ్చే ఏడాది నుంచి విగ్రహాల తయారీ నుంచే పీఓపీతో తయారు చేసే విగ్రహాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి రూట్ క్లియర్ అయింది.