విజయ హత్య నిందితుడిపై కఠిన చర్యలు: సీఎం కేసీఆర్
తహశీల్దార్ విజయారెడ్డి హత్యను సీఎం కేసీఆర్ ఖండించారు. ఆమె హత్య గురించి తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలో ఓ అధికారి హత్యకు గురవడం కలచివేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. విజయారెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. తహశీల్దార్ హత్యను రెవెన్యూ సంఘాలు, తహశీల్దార్ అసోసియేషన్ ఖండించింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం దారుణం జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు తహశీల్దార్తో మాట్లాడాలని సురేశ్ లోపలికి వెళ్లారు. దాదాపు అరగంట ఛాంబర్లో ఉన్నారు. బయటకొచ్చిన వెంటనే విజయారెడ్డి కూడా వచ్చారు. అయితే అప్పటికే ఆమెకు మంటలు పూర్తిగా అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడబోయారు.
అప్పటికే తీవ్రగాయాలైన విజయారెడ్డి మృతిచెందారు. తహశీల్దార్కు నిప్పంటించిన సురేశ్ వెంటనే పీఎస్ వద్దకెళ్లాడు. కానీ అతనికి కూడా 60 శాతం గాయాలు కావడంతో పోలీసులు అతనిని హయత్నగర్లోని సన్ రైజ్ ఆస్పత్రికి తరలించారు. విజయారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అయితే అతని తల్లి పద్మ సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పడం కలకలం రేపింది.