గాంధీలో ఏం జరుగుతోంది..? ఈఎస్ఐని మించిన స్కామ్లు.. డా.వసంత్ సంచలన ఆరోపణలు
కరోనా వైరస్ వ్యవహారంలో అనుమానిత కేసులను పాజిటివ్ కేసులుగా ప్రచారం చేశారన్న ఆరోపణలతో డా.వసంత్తో పాటు మరో ముగ్గురు వైద్యులపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే తప్పుడు ఆరోపణలతో తనను సస్పెండ్ చేశారని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్ వసంత్ కుమార్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న వసంత్.. తాజాగా గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలో అనేక స్కామ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా శానిటేషన్,హౌస్ సర్జన్,సెక్యూరిటీ విషయంలో స్కామ్స్ జరిగాయని ఆరోపించారు. వీటికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఇందులో డాక్టర్ వసంత్ కూడా ఉన్నారు.వసంత్ ఇంకా ఏమేమి చెప్పారంటే..
వసంత్ ఆరోపణలు..
ఈఎస్ఐ స్కామ్ను మించిన స్కామ్ గాంధీ ఆస్పత్రిలో జరుగుతోందని వసంత్ ఆరోపించారు. చాలామంది హౌస్ సర్జన్స్ అసలు ఆస్పత్రికే రావడం లేదన్నారు. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి.. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంటారని చెప్పారు. కొందరు హౌస్ సర్జన్లు ఏకంగా విదేశాలకు వెళ్లిపోయారని.. ఆస్పత్రికి రాకుండానే డబ్బులు పెట్టి వారు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు కొంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 370 మంది హౌస్ సర్జన్స్ గాంధీ ఆస్పత్రిలో ఉన్నారని.. కానీ వారిలో 220 మంది కనీస అటెండెన్స్ లేదని అన్నారు. కొంతమంది అసలు ఆస్పత్రికే రావట్లేదన్నారు.
అటెండెన్స్ నిల్.. శాలరీ ఫుల్...
శానిటేషన్,సెక్యూరిటీ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. దాదాపు 300 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారని.. కానీ వాళ్లెవరూ విధుల్లో కనిపించరని అన్నారు. కానీ అటెండెన్స్ మాత్రం రోజూ 80శాతం ఉన్నట్టు చూపిస్తారని ఆరోపించారు. అసలు ఆస్పత్రిలో రెండేళ్లుగా బయోమెట్రిక్ కూడా పనిచేయడం లేదన్నారు. అటెండెన్స్ను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన టీమ్ ఉందని.. వారిని మేనేజ్ చేసి ఫోర్జరీ సంతకాలతో అటెండెన్స్ వేయించుకుంటున్నారని ఆరోపించారు. విధులకు రాకపోయినా వేతనాలు మాత్రం పొందుతున్నారని ఆరోపించారు.
డీఎంఈపై ఆరోపణలు..
ఇక ట్రాన్స్ఫర్స్ విషయంలో గాంధీ ఆస్పత్రి డీఎంఈ రమేష్ రెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు నచ్చినవాళ్లను కోరిన చోటుకు ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారని,తమలాంటి వాళ్ల సంగతి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తాను 2015 నుంచి గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నానని చెప్పిన వసంత్.. అకారణంగా తనను సస్పెండ్ చేశారని అన్నారు. తనకు ఇచ్చిన నోటీసుల్లో.. ఉన్నతాధికారులతో అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్ వేటు వేసినట్టు పేర్కొన్నారని అన్నారు. తానెవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పారు.
గాంధీ సూపరిండెంట్ అత్యవసర సమావేశం..
డాక్టర్ వసంత్ ఆరోపణలను గాంధీ ఆస్పత్రి అధికారులు ఖండిస్తున్నారు. వసంత్ మతి స్థిమితం లేని వ్యక్తి అని.. అతని ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. గాంధీలో నిజంగా స్కామ్స్ జరిగితే.. ఆత్మహత్యకు యత్నించే బదులు.. ప్రెస్ మీట్ పెట్టి స్కామ్ వివరాలను వెల్లడించాల్సిది కదా అంటున్నారు. మరోవైపు గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ శ్రవణ్ నేడు హౌస్ సర్జన్స్,హెచ్ఓడీలు,ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వసంత్తో ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద డాక్టర్ వసంత్ చేస్తోన్న ఆరోపణలు గాంధీ ఆస్పత్రిలో అసలేం జరుగుతోందన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.