వామ్మో.. ఏడీజీ పేరుతోనే మోసం.. ఫేక్ అకౌంట్ అన్ ఫ్రెండ్ చేయాలని స్వాతి లక్రా పిలుపు..
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీస్ అధికారుల ఫొటోలు, పేర్లు కూడా వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఫ్రెండ్ రిక్వెస్టు పంపించి అమాయకులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో గల అధికారులు, డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేర్లతోనూ నకిలీ ఖాతాలు తెరిచారు.
ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డీజీ స్వాతీ లక్రా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా వెలుగులోకి వచ్చింది. తన పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు. నకిలీ ఖాత నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులు ఇప్పటికే అక్సెప్ట్ చేస్తే.. వాటిని వెంటనే అన్ఫ్రెండ్ చేయాలని ఆమె కోరారు. ఫేక్ అకౌంట్ సృష్టించినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చాట్ చేస్తూ నమ్మకం కలిగాక ఏవో కారణాలు చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఒడిశా, గుజరాత్ నుంచి సైబర్ నేరగాళ్ల ఆపరేషన్ జరుగున్నట్టుగా పోలీసులు భావిస్తుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మంది పోలీసుల పేరుతో మోసాలు జరిగినట్టు తెలిసింది. ఎస్సై నుంచి డీజీ హోదా వరకు అందరి పేర్లతో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు.
నకిలీ ఖాతాల వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధిత అధికారులు భావిస్తున్నారు. నేరగాళ్ల బారినపడకుండా ఉండటానికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహా మోసాలు వెలుగుచూశాయి. విజయవాడ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోపోలీస్ అధికారుల పేర్లతో సైబర్ కేటుగాళ్లు ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేసి.. అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు.