స్వీట్ రివెంజ్..! పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దారి మూసేసిన ఘనుడు..! నో వే..!!
మహబూబాద్/ హైదరాబాద్ : దేశం లో జరిగే అన్ని ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఇగో, ప్రెస్టేజ్, పెత్తనం, అజమాయిషీ, ఆదిపత్యం, మాట పట్టింపు, అన్నీ కలగలుపుగా ఉంటాయి. గ్రామాల్లో తాము బల పరిచిన అభ్యర్థి ఓడిపోతే తల నరికినంత అవమానంగా భావిస్తుంటారు. ఒక వేళ అభ్యర్థి ఓడిపోతే గ్రామస్తుల మీద రకరకాల ప్రతీకార చర్యలకు పూనుకుంటారు. ఇదే ఘటన ఇటీవల తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన సందర్బంగా చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలు ముగిసినా., గ్రామాల్లో పగలు మాత్రం చల్లారలేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని ఆరోపిస్తూ ఓ రైతు వ్యవసాయ పొలాలకు వెళ్లే డొంకదారిని జేసీబీతో తవ్వేసి దారికి అడ్డంగా కంచె ఏర్పాటు చేసిన ఘటన మరిపెడ మండలంలోని ఎడ్జెర్ల శివారు గుర్పప్పలో జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన బానోతు రామన్న ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రామస్తుల మీద ప్రతీకారంతో రగిలి పోయాడు.
ఇది దృష్టిలో పెట్టుకొని డొంక దారి మధ్యలో రామన్న భూమిలో నుంచి ఉన్న దారిని జేసీబీ ద్వారా తవ్వించాడు. వాస్తవానికి తండా నుంచి సుమారు 100 మంది రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలేక ఇబ్బందులు పడేవారు. 12 సంవంత్సరాల క్రితం తండాలో పెద్దమనుషులు అందరూ మాట్లాడుకుని తల కొంత భూమి ఇస్తామని ముందుకు వచ్చి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడెం గ్రామం వరకు డొంకదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రహదారిపై ఉన్న గుంతలను సైతం గ్రామ పంచాయతీ నిధులతో మట్టి పోయించి చదును చేసుకున్నారు. పస్తుతం పీఆర్డబ్ల్యూ కింద తారురోడ్డు కూడా మంజూరు అయ్యింది. అయితే ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని రామన్న తన భూమిలో నుంచి ఉన్న దారిని జేసీబీ ద్వారా తవ్వించి గుంతలు గుంతలుగా చేసాడు. దారికి అడ్డంగా కంచెను కూడా ఏర్పాటు చేశారు. రైతులు బతిలాడినప్పటికీ దారి ఇవ్వనని తెగేసి చెప్పి తన స్వీట్ రివెంజ్ ని చాటుకుంటున్నాడు రామన్న. రామన్నా..! ఏందన్నా ఇది..!!