అట్టహాసంగా ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారం..! ఎలాంటి బాధ లేదన్న హరీష్..!!
హైదరాబాద్: రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. అరగంట వ్యవధిలో 10మంది మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ పూర్తి చేయించారు. తొలుత ఏ.ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా వరుసగా తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ కే.స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే టీ. హరీష్రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో గ్రూపు ఫొటో దిగారు.
హరీశ్ రావు రాజ్ భవన్ లోకి ప్రవేశించగానే మంత్రులుగా ప్రమాణం చేయనున్న సభ్యులను ఆలింగనం చేసుకున్నారు. తరువాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కన ఆసీనులయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తరువాత ఒక్కడే వెళ్లిపోయాడు. టీఆర్ఎస్ పార్టీలో సైనికుడినని, ఈ విషయాలను ఎన్నికలకు ముందు పదుల సార్లు చెప్పడం జరిగిందని మాజీ మంత్రి టీ.హరీశ్ రావు అన్నారు.
నాకు ఎలాంటి గ్రూపులు లేవు, నా మంత్రి పదవిపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అలంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, వాటిని ఖండిస్తానన్నారు. క్యాబినెట్ లో తనకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అందరూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటానని అన్నారు. రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన హరీశ్ రావు బయట మీడియాతో కొద్దిసేపు చెప్పాల్సిన విషయాలను చెప్పి వెళ్లిపోవడం విశేషం..!