కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచిన టీ కాంగ్రెస్..!దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందన్న రేవంత్
న్యూఢిల్లీ/హైదరాబాద్ : రెండో సారి అదికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషాయానికి వచ్చే సరికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి చేయి చూపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తీవ్ర నష్టం చేసిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. నిర్మలా సీతారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. రైతులు, నిరుద్యోగుల గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదని అన్నారు. పబ్లిక్ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సరికాదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని విచారం వ్యక్తం చేసారు.
కేంద్రం కావాలనే చిన్న చూపు..! తెలంగాణ కేటాయింపులపై రేవంత్ ఫైర్..!!
కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించిన ఆయన మాట్లాడుతూ విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహం ఇచ్చే పథకాలు లేవన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్ధం అవుతోందన్నారు.
ఇది పేదల సంక్షేమ బడ్జెట్..! సీతమ్మ పద్దులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని..!!
దక్షిణ రాష్ట్రాల మీద అక్కసు..! నిర్మల బడ్జెట్ నీరు గార్చిందన్న మల్కాజిగిరి ఎంపీ..!!
దీనిపై దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా ఆలోచించి కేంద్ర వైఖరిని ఖండించాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా వ్యక్తిగత కేసులకు భయపడి సీఎం కేసీఆర్ భయపడి మాట్లాడడంలేదని, పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇన్కమ్ ట్యాక్స్లో పేద, మధ్య తరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దక్షిణాది మంత్రి అయిన ప్రధాని మోదీ చేతిలో కీలు బొమ్మ అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్..! ద్వజమెత్తిన ఎంపీ కోమటిరెడ్డి..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే బడ్జెట్లో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించిన ఆయన మాట్లాడుతూ బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదని పెదవి విరిచారు. రైతుల గురించి కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాల ప్రస్తావన లేదన్నారు. కేంద్ర బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్గా కోమటిరెడ్డి అభివర్ణించారు. గత ఐదేళ్లు కేసీఆర్.. మోదీ భజన చేశారని.. అయినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని కోమటిరెడ్డి విమర్శించారు.
కక్ష్య సాధింపు రాజకీయాలకు ఇదే ఉదాహరణ..! మండిపడ్డ కోమటి రెడ్డి..!!
గిరిజన విశ్వవిద్యాలయం, గేమ్స్కు నిధులు కేటాయించలేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదుని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు. వ్యక్తిగత కారణాలవల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు. పెట్రో ధరలు పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. దీనిపై పార్లమెంట్ లోపల బయట ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం చేస్తాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.