వేగం పెంచిన టీ కాంగ్రెస్..!ప్రజాసమస్యలే ఎజెండాగా కార్యాచరణ..!సందడిగా మారుతున్న గాంధీభవన్.!
హైదరాబాద్ : ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపాది చూపించే అంశం దగ్గర నుండి దూరప్రాంతాలకు చేరుకునే క్రమంలో వలస కూలీలను ఆదుకునే అంశం వరకూ పకడ్బంధీగా ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. ముందు చూపు లేకుండా విధించిన లాక్డౌన్ ఆంక్షల వల్ల లక్షలాది వలస కార్మకుల జీవనం మృగ్యంగా మారిందని, వారందరిని స్వస్థాలకు చేర్చే బృహత్కర కార్యక్రమాన్ని బుజాన వేసుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అంతే కాకుండా తెలంగాణలో ప్రాజెక్టుల సంరక్షణ కూడా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని, అందుకు తగ్గట్టుగా టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వ్యూహ రచన జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రాజెక్టుల రక్షణ బాద్యత కాంగ్రెస్ దే..!కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేయకపోతే ప్రమాదమేనన్నఉత్తమ్.!
ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కాంగ్రెస్ తో దీనగాధను చెప్పుకున్న వలసకూలీలు..
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వేగంగా పావులు కదుపుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కరోనా వైరస్ మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ ఆంక్షల వల్ల సమస్యల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పట్ల కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. గాంధీభవన్లో వలస కార్మికులతో మమేకమయిన పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పదివేల రూపాయలు వలస కార్మికులకు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు ఉత్తంకుమార్ రెడ్డి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పించారు కాంగ్రెస్ నేతలు.
ఒడిస్సాకు బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్.. స్వస్థాలలకు వెళ్లిన కూలీలు..
టీపీసీసీ పిలుపు మేరకు వివిధ దేశాలల్లో ఉన్న ఐఓసి తెలంగాణ ఆధ్వర్యంలో ఒడిస్సా కి చెందిన వలస కూలీలకు హైదరాబాద్ నుండి వెళ్లేందుకు బస్సు ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు వినోద్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. దాదాపు 1400 కిలోమీటర్లు దూరప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. బస్సు బయలుదేరే ముందు వలస కార్మికులతో టీపీసీసీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయం అందలేదని వలస కార్మికులు చెప్పుకొచ్చారు. భారతదేశంలో పుట్టిన తమ పట్ల ఇంత వివక్ష చూపడం దారుణమని వలస కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రభుత్వంలో సమర్ధత లేని మంత్రులున్నారు.. మండిపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
అంతే కాకుండా మంజీరా డ్యామ్ కు నీళ్లు తేలేకపోతే ప్రజా ఉద్యమం చేపడతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంగారెడ్డి నీళ్ళ సమస్య పై అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, సీఎం చంద్రశేఖర్ రావు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గడిచిన మూడేళ్ల నుంచి మంజీరా డ్యామ్ లో నీళ్లు లేక బోసిపోయిందని, ఎమ్మెల్యేకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా పాలిస్తున్న ప్రభుత్వం కేవలం చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే నని మండిపడ్డారు. ప్రజావసారల దృష్ట్యా నీళ్లు అందివ్వకున్నా ఒక ఎంపీ, రెండు మున్సిపల్ చైర్మన్ పదవులు గులాబీ పార్టీకి ప్రజలు కట్టబెట్టారని జగ్గారెడ్డి గుర్తు చేసారు. తెలంగాణ మంత్రి వర్గంలో కనీస విలువలు లేని మంత్రులున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెల 4వ తేదీన టి-కాంగ్రెస్ బృందంతో మంజీరా డ్యామ్ పర్యటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
అప్పుల తెలంగాణగా మార్చారు.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న వంశీచంద్ రెడ్డి..
ఇదిలా ఉండగా కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ గత మూడు నెలలుగా సగం జీతానికే పని చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. అప్పులు చెల్లించడం కోసం ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నామని సీఎం చెప్వడం సిగ్గుచేటని వంశీచంద్ పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఆర్థికంగా వెనుకబడిన బీహార్-ఛత్తీస్ ఘడ్, ఏపీ కంటే వెనకబడి ఉన్నామా అనే సందేహాన్ని వ్యక్తం చేసారు. ముందుచూపు లేని ప్రభుత్వ విధానాల పట్ల, ప్రాజెక్టులకోసం చేసిన దుబారా వ్యయం పట్ల గతంలో 14thఫైనాన్స్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని గుర్తు చేసారు. అప్పుల తెలంగాణగా మార్చినందుకు చంద్రశేఖర్ రావు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేసారు.