2 కిలోల బంగారం, రూ.32 లక్షల క్యాష్, డాక్యుమెంట్స్.. కీసర నాగరాజు అక్రమాస్తులు రూ.150 కోట్లు..
ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ అక్రమాస్తుల గుట్టా బట్టబయలవుతోంది. అతను అక్రమంగా రూ.150 కోట్లకుపైగా సంపాదించాడని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతని నివాసంలో 36 గంటలపాటు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు.

32 లక్షల నగదు సీజ్
నాగరాజుపై ఫిర్యాదు రావడంతో శుక్రవారం రైడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు కూడా అతనిపై ఏసీబీ ఫోకస్ చేసింది. గతంలో అవినీతి వ్యవహారంలో అరెస్టైనా.. తీరు మారకపోవడంతో దృష్టిసారించింది. శుక్రవారం నుంచి 36 గంటలపాటు అల్వాల్లోని నాగరాజు ఇంటిలో సోదాలు నిర్వహించారు. రూ. 32 లక్షల నగదు పట్టుబడింది. రెండు కిలోల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులలో ఉన్ లాకర్లను గుర్తించారు. వాటిని సోమవారం తెరుస్తామని.. అందులో కీలక పత్రాలు ఉండే అవకాశం ఉంది.

14 రోజుల రిమాండ్
నాగరాజుతోపాటు వీఆర్వో, ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించారు. నాగరాజు బంధువులు, స్నేహితులపై కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు. ఇదివరకు శామీర్ పేటలో పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాగరాజు అరెస్టయ్యారు. జైలుకెళ్లి తిరిగొచ్చినా.. అవినీతిని మాత్రం ఆపలేదు. తన వద్దకు వచ్చేవారిని అడిగి మరీ లంచం తీసుకునేవాడు అని తెలుస్తోంది.

బ్యాంకు లాకర్లలోనూ నగదు..?
కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లలో కూడా భారీగా నగదు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఉండొచ్చని భావిస్తున్నారు. కీసరలోని నాగరాజు కార్యాలయం నుంచి కూడా కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రిటైర్డ్ ఏఎస్పీ కూడా బాధితుడే..
తహసీల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తోంది. సామాన్య ప్రజలే కాదు, మాజీ అధికారులు, ప్రముఖులు కూడా అతని బాధితులేనని తెలుస్తోంది. పోలీసు అధికారుల వద్ద నుంచి లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల్లో తాను ఒకరినని రిటైర్డ్ అదనపు ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. న్యాయపరంగా అన్ని పత్రాలు ఉన్నా.. పట్టా పాస్ పుస్తకం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని మీడియాకు సురేందర్ రెడ్డి తెలిపారు.

4 ఎకరాల స్థలం పట్టా కోసం వేధింపులు
రిటైర్ అయ్యాక 2018లో సర్వేనెంబర్ 614లో 4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. దానికి సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని.. కానీ పట్టా పాస్బుక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు. దీనిపై ఇదివరకు తాను సీఎస్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, ఆర్డీవో ఫిర్యాదు చేశానని వివరించారు. అయినప్పటికీ ఫలితం లేదు అని సురేందర్ రెడ్డి తెలుపడం గమనార్హం. పోలీసు అధికారి తననే లంచం అడిగాడంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. రియల్ ఎస్టేట్ మీడియేటర్స్తో కలిసి దందా చేస్తున్నాడని తెలిపారు.