విజయా రెడ్డి హత్య కేసు.. కాల్డేటాలో కీలక విషయాలు.. మాజీ ప్రజాప్రతినిధితో..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సురేష్ కాల్ డేటాపై పోలీసులు దృష్టిపెట్టి పలు కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. గౌరెల్లి, బాచారం తదితర ప్రాంతాల్లోని భూముల వివాదమే విజయారెడ్డి హత్యకు కారణమని స్పష్టం కావడంతో ఈ వివాద భూముల వెనుక ఎవరి హస్తముందనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణలో బయటపడిన విషయాలు ఇవే..
విజయారెడ్డి సజీవదహనం: సురేష్ కాకుండా.. ఇంకా చాలా మంది హస్తం.. భర్త 'సీబీఐ’ డిమాండ్
ఉన్నతాధికారుల దృష్టికి
అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ పరిధిలో భూముల వివాదం తీవ్ర స్థాయి చేరుకోవడంతో తహశీల్దార్ విజయారెడ్డి పలుమార్లు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో తన కార్యాలయానికి భద్రత పెంచాలని అధికారులను విజయారెడ్డి కోరినట్టు తెలుస్తున్నది. వివాదాస్పద భూములపై ఆందోళన పెరుగుతుండటంతో పై అధికారుల దృష్టికి తహశీల్తార్ తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందనే వాదన వినిపిస్తున్నది.
మాజీ ప్రతినిధి అమ్మకం
అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ పరిధిలో నిందితుడు సురేష్కు చెందిన 9 ఎకరాలు మాజీ ప్రజాప్రతినిధికి అమ్మినట్టు పోలీసులు గుర్తింంచారు. నిందితుడు సురేష్ కాల్డేటా పరిశీలించగా.. హత్య జరిగిన రోజు చాలా మందితో ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కాల్ డేటాలో సురేష్ కాల్ లిస్టులో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే సురేష్ ఎవరితో మాట్లాడారో అనే కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు.
హత్యకు ముందు సురేష్
తహశీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన తర్వాత కార్యాలయం నుంచి సురేష్ బయట నడుచుకొంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టమయ్యాయి. హత్య అనంతరం సమీపంలో ఓ కారులో కూర్చొని ఉన్న వ్యక్తితో సురేష్ మాట్లాడినట్టు పోలీసుల దృష్టికి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే కారులో ఉన్న వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
కాల్డేటాపై పోలీసుల దృష్టి
ఇక విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ వ్యవహారంపై కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నోరు విప్పడం లేదనే విషయం తెలిసింది. వివాదస్పద భూముల వ్యవహారంలో సురేష్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తున్నది. ఇక కేసులో కీలక విషయాలను బయటకు లాగేందుకు కాల్ డేటాలో ఉన్నవారందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.