ట్యాంక్బండ్పై కారులో మంటలు... బస్టాప్ కూడా దగ్ధం... తెల్లవారుజామున హైడ్రామా...
హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై సోమవారం తెల్లవారుజామున ఓ హైడ్రామా చోటు చేసుకుంది. నిమజ్జనంలో పాల్గొని తిరిగొస్తున్న ఓ బృందం... బైక్పై అతివేగంతో దూసుకెళ్తున్న ఇద్దరు యువకులను వారించింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన ఆ యువకులు పట్టరాని ఆవేశంతో ఆ బృందం ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. కాసేపటికి ఆ యువకుల స్నేహితులు కూడా రావడంతో... గొడవ పెద్దదైంది. ఇంతలోనే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న బస్టాప్ కూడా కాలి బూడిదైంది.
Recommended Video
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం.. పార్సీగుట్ట జమిస్థాన్పూర్కు చెందిన అరుణ్ (27), సాయికుమార్ (28), సంతోష్ (22), మల్లికార్జున్(27) కలిసి తమ ఏరియాలో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆదివారం రాత్రి టాటా సఫారీ వాహనంలో వినాయకుడిని ట్యాంక్బండ్కి తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. తెల్లవారుజామున 3.30గం. సమయంలో తిరిగి ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ట్యాంక్బండ్ చిల్డ్రన్ పార్కు వద్ద ఇద్దరు యువకులకు,వారికి మధ్య గొడవ జరిగింది.
వారించినందుకు దాడి...?
సఫారీ వాహనంలో ఇంటికి వెళ్తున్న సమయంలో... బైక్పై ఇద్దరు యువకులు ట్యాంక్బండ్పై అతివేగంతో దూసుకెళ్తూ కనిపించారు. దీంతో కారులో ఉన్నవాళ్లు ఆ బైక్పై వెళ్తున్న యువకులను వారించారు. ఆ వెంటనే కారు వద్దకు దూసుకొచ్చిన ఆ యువకులు... అందులో ఉన్నవారితో గొడవకు దిగారు. సంతోష్,సాయి కారు నుంచి కిందకు దిగి ఆ ఇద్దరు యువకులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆ యువకుల స్నేహితులు కూడా అక్కడికి చేరుకుని వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇంతలో కారు దగ్ధం...
ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగానే సఫారీ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇరువురు అక్కడి నుంచి పారిపోయారు. కారులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బస్టాప్కి కూడా వ్యాపించడంతో అది కూడా దగ్ధమైంది. దీంతో ట్యాంక్బండ్పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఫైరింజన్ సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేయగలిగారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారులో అసలు మంటలు ఎలా చెలరేగాయన్నది మిస్టరీగా మారింది.