విషాదం: అపార్ట్మెంట్పైనుంచి దూకి టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని మదీనాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో పనిచేస్తున్న ఓ యువతి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్పై నుంచి పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కె మహతి(28) మదీనగూడలో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని టీసీఎస్లో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం తాను నివాసం ఉంటున్న ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్య సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించారు. మహతి ఆత్మహత్య చేసుకుంటుండగా ఆమె సోదరి ఆమె గదిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, అకస్మాత్తుగా తన సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
మహతి పైనుంచి దూకడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, మహతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతోనే మహతి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలంలో కూడా ఎలాంటి సూసైడ్ లభించలేదని తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.