టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్.. ప్రభుత్వాల పనితీరు.. పథకాల అమలుపై ఓ లుక్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. ప్రధానపార్టీలైన టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఓటర్లు ఎటువైపు మొగ్గుతారోననే ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ, గత ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది, అవి అమలు చేసిన పథకాలు తదితర విషయాలపై ఓ లుక్ వేద్దాం.
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు పార్టీలే ప్రభుత్వాలు నడిపాయి. టీడీపీ తప్పితే కాంగ్రెస్, కాంగ్రెస్ తప్పితే టీడీపీ ఇలా ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చాయి. 1994, 1999లో టీడీపీ ప్రభుత్వంలో ఉంటే.. 2004, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 వచ్చేసరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఉద్యమంతో బాగా బలపడ్డ టీఆర్ఎస్ 119 నియోజకవర్గాలకు గాను 63 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 1994, 1999 రెండు టర్మ్ లు టీడీపీ అధికారంలో ఉంది. 2020 విజన్, ఐటీ పరిశ్రమలను హైదరాబాద్ కు తీసుకురావడం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో టీడీపీ ముందుచూపుతో వ్యవహరించదని చెప్పొచ్చు. ఇక 2004, 2009లో పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చిందనే పేరుంది. 2014 లో తెలంగాణ వీడిపోయి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రజాకర్షక పథకాలు బాగానే అమల్లోకి తెచ్చింది.
3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్, టీడీపీతో పాటు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పనితీరుపై కొన్ని ప్లస్, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. టీడీపీ ఐటీ రంగంపై పెట్టినంతలా దృష్టి సంక్షేమ పథకాలపై పెట్టలేదనే వాదన ఉంది. రైతులకు కరెంట్ ఇచ్చే విషయంలో టీడీపీపై ప్రభుత్వ వ్యతిరేకత బాగా వచ్చింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేక ధోరణి చూపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో ముందడుగు వేసినా కరెంట్ కోతలు ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి.
4. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దీపం పథకం (గ్యాస్ సిలిండర్లు), డ్వాక్రా గ్రూపులకు (మహిళా సంఘాలు) తక్కువ వడ్డీతో రుణాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం తదితర పథకాల అమలుతో ప్రజలకు చేరువయింది. రైతులకు కరెంట్ ఇచ్చే విషయంలో వారు ఆందోళనకు దిగితే లాఠీఛార్జ్ జరగడం టీడీపీకి పెద్ద మైనస్ పాయింట్. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరోగ్యశ్రీ తో ఆ పార్టీకి ప్రజాభిమానం బాగానే ఉండేది. ఎంతోమంది ఆరోగ్యశ్రీ సేవలతో ఉచిత వైద్యం అందుకున్నారు. ఆడపిల్లలను చదువుకునేలా ప్రోత్సహించడానికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేలా తీసుకొచ్చిన బంగారు తల్లి పథకం కూడా బాగానే ప్రాచుర్యం పొందింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, పెన్షన్లు, రూపాయికే కిలో బియ్యం, ప్రభుత్వ హాస్టళ్లల్లో సన్నబియ్యం, ప్లస్ పాయింట్లుగా ఉంటే.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేదనే అపవాదు మూటగట్టుకుంది.
5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా కూడా వరుసగా రెండు టర్ములకు మించి అధికారంలో లేదు. మూడోసారి పాలనాపగ్గాలు చేపట్టాలనుకునేసరికి ప్రజాభిప్రాయం మారుతుందన్నమాట. దీంతో అప్పటివరకు రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీన్నిబట్టి ఏ ప్రభుత్వంపైన కూడా ప్రజలకు సానుకూల దృక్పథం లేదనే చెప్పొచ్చు. అధికారంలోకి ఎవరొచ్చినా ఏం లాభం.. మా బతుకులు మాత్రం మారడం లేదనే నిరాశ కనిపిస్తోంది. అయితే తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అమలుతో పాటు కరెంట్ కోతలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింటని చెప్పొచ్చు.
6. టీఆర్ఎస్ కు కొన్ని సంక్షేమ పథకాల అమలు ప్లస్ అవుతున్నా.. మరికొన్ని మాత్రం నెగెటివ్ గా మారాయి. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్.. అమలులో విఫలమైందనే వాదనలున్నాయి. 2014 ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందనే ఆరోపణలున్నాయి. రైతులకు ఎకరానికి 4,000 రూపాయల చొప్పున రైతుబంధం పథకం కింద ఇస్తున్నా.. కౌలు రైతులకు ఇవ్వకపోవడం మైనస్ గా మారింది. ఇలా కొన్ని అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనే టాక్ ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో క్షేత్రస్థాయిలో బాగా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
7. ఇప్పటి ముందస్తు ఎన్నికల్లో భాగంగా అటు టీఆర్ఎస్ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి. వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి, వికలాంగులకు పెన్షన్లు, ఆడబిడ్డల పెళ్లిళ్లు తదితర పథకాలకు సంబంధించి ఇరు పార్టీలు దాదాపు సమానంగా రూపొందించడం గమనార్హం. వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్లు టీఆర్ఎస్ ఇప్పటికే వెయ్యి రూపాయలు ఇస్తుంటే కాంగ్రెస్ ఇప్పటి మేనిఫెస్టోలో 2,000 రూపాయలు ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్ కూడా ఆ మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. వికలాంగులకు ఇప్పటికే 1,500 రూపాయల పెన్షన్ టీఆర్ఎస్ ఇస్తుంటే.. కాంగ్రెస్ ఈసారి దాన్ని రెట్టింపు చేస్తూ 3,000 రూపాయలుగా ప్రకటించింది. అటు టీఆర్ఎస్ కూడా 3,016 ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొంది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళనతో వారికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్ కూడా 3,016 రూపాయలు ఇస్తామని పేర్కొంది.