టీడీపీ గ్రేటర్ మేనిఫెస్టో విడుదల: ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాల్సిందే!
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్బంగా ఎన్టీఆర్ భవన్లో టీడీపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు.
Recommended Video
తెలంగాణలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ రద్దు కావాలంటే.. టీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇవ్వాలని ఎల్ రమణ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనన్నారు. హామీలను విస్మరించిన టీఆర్ఎస్ను ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. హ్యాపీ హైదరాబాద్ నినాదంతో గ్రేటర్ ఎన్నికలు వెళ్తున్నట్లు తెలిపారు. టీడీపీని నమ్మి ఓటేయాలని, నమ్మకంగా పనిచేస్తామని రావుల పిలుపునిచ్చారు.
హ్యాపీ హైదరాబాద్, తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో... pic.twitter.com/uLCedxaWjH
— Telugu Desam Party - Telangana (@TDPTelangana) November 23, 2020
మాటలకే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయడంతోపాటు పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. పూర్తిస్థాయిలో వైఫై చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని హామి ఇచ్చారు. నగరంలోని ప్రతిపేదవాడికి పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు.
డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 1న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కరోనావైరస్ కారణంగా పోలింగ్ సమయాన్ని ఓ గంటపాటు పెంచుతామన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ చేపట్టి ఫలితాల్ని ప్రకటించనున్నారు.