హుజూర్నగర్ బరిలో టీడీపీ.. అభ్యర్థి వేటలో అధినేత చంద్రబాబు
తెలంగాణ గట్టు మీద హుజూర్నగర్ ఉప పోరు రంజుమీదుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ కూడా బరిలోకి దిగింది. ఇక తాము కూడా అంటుంది టీడీపీ. ఉప ఎన్నికలో సైకిల్ పార్టీ కూడా పోటీ చేస్తుందని తెలుస్తోంది. మరోవైపు భారీగా స్థానిక నేతలు కూడా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రైతులు బరిలోకి దిగారు. దీంతో సిట్టింగ్ ఎంపీ కవిత విజయవాకాశాలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సర్పంచ్ లు నామినేషన్ కాంగ్రెస్ మైనసై, టీఆర్ఎస్ కు లాభిస్తోందా అనే అంచనాలు విసృతంగా సాగుతున్నాయి.
హుజూర్ నగర్ నుంచి టీడీపీ కూడా పోటీ చేయబోతోంది. పోటీ చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీనియర్ నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థి ఎవరనే అంశంపై డిస్కష్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురి అభిప్రాయం తీసుకున్నారని.. సమాచారం. హుజుర్ నగర్ టీడీపీ అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ అడ్రస్ కనుమరుగైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అధికార, విపక్షాలుగా కొనసాగుతున్నాయి. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలంతా ఇతర పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీ ఉనికి చాటేందుకు పోటీచేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటి.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.