హైదరాబాద్లో టెకీ ఫ్యామిలీ ఆత్మహత్య: మృతురాలి తండ్రి ట్విస్ట్
హైదరాబాద్ వనస్థలిపురంలోని హస్తినాపురం పరిధిలో ఉన్న సంతోషిమాత కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. శనివారం నుంచి ప్రదీప్,ఆయన భార్య ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని.. ఎక్కడికైనా వెళ్లి ఉంటారని భావించామని కుటుంబ సభ్యులు తెలిపారు.
కానీ ఆదివారం కూడా వారు కాంటాక్ట్లోకి రాకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. దీంతో నలుగురు విగతజీవులై కనిపించారు. ఇద్దరు పిల్లలు కల్యాణ్ కృష్ణ,జయకృష్ణ, భార్యాభర్తలు ప్రదీప్,స్వాతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రదీప్ తండ్రి చెబుతుండగా.. కోట్ల ఆస్తి వున్న ప్రదీప్కు అది పెద్ద విషయమేమీ కాదని ప్రదీప్ భార్య తండ్రి చెబుతున్నారు.
స్వాతి తండ్రి ట్విస్ట్
ప్రదీప్ రాసిన సూసైడ్లో రూ.40లక్షలు అప్పులు ఉన్నట్టు పేర్కొన్నాడు. అయితే కోట్లల్లో ఆస్తులు ఉన్న ప్రదీప్కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్వాతి తండ్రి అన్నారు. ఐబీఎంలో సాఫ్ట్వేర్ జాబ్, సొంత ఇల్లు ఉందని.. లక్షల రూపాయాల అప్పుకు ఆత్మహత్య చేసుకోవడం మూర్ఖత్వమో మరేంటో అర్థం కావట్లేదని అన్నారు. తమ కుమార్తె అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. ఆమెకు తెలియకుండానే విషం ఇచ్చి ఉంటారని.. లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండకపోయేదని అన్నారు.
కుటుంబమంతా సంతోషంగానే ఉందని..
ఆదివారం తమ కుటుంబం శ్రీశైలం వెళ్తుండగా ప్రదీప్ తండ్రి తమకు ఫోన్ చేశారని.. ఉదయం నుంచి కొడుకు,కోడలు ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని చెప్పారన్నారు. ఆ తర్వాత కొద్ది గంటలకు మళ్లీ ఫోన్ చేసి.. కరీంనగర్లో ఏదో ఫంక్షన్కి వెళ్తామని చెప్పారని.. బహుశా అక్కడికి వెళ్లి ఉండవచ్చునని అన్నట్టుగా చెప్పారు. ఇటీవలే తమ కుమార్తెకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిందని.. వాళ్ల అమ్మ కూడా నెల రోజులు ఇక్కడే ఉందని చెప్పారు. ఆ సమయంలో వారంతా సంతోషంగానే ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి బాధలు లేవని అన్నారు.
ప్రదీప్ తండ్రి ఏమన్నారు..
ప్రదీప్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండేవారన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నమ్ముకుంటే విలాసవంతంగా గడపలేమని.. వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టాడని అన్నారు. దాదాపు రూ.40లక్షలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టాడని.. తీరా వాటిని తీర్చలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నట్టుగా తెలిపారు. కొడుకుగా నేను నిన్ను పోషించాల్సిన వయసులో.. మళ్లీ నీపై ఆధారపడటం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడన్నారు. తన పిల్లలు కూడా భారం కావద్దనే ఉద్దేశంతో వారికి పురుగుల మందు ఇచ్చినట్టు చెప్పారు.
ఉస్మానియా మార్చురీకి తరలింపు..
శనివారం మధ్యాహ్నమే పిల్లలకు,భార్యకు ప్రదీప్ విషమిచ్చి చంపేసినట్టుగా చెబుతున్నారు. రోజంతా శవాలతోనే ఉన్న ప్రదీప్.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.శనివారం నుంచి వాళ్లెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.