భార్య, అత్తమామల వేధింపులు తాళలేక టెక్కీ ఆత్మహత్య..
హైదరాబాద్ : కొత్తగా పెళ్లైంది. భార్య రాకతో జీవితం కొత్త బంగారులోకం అవుతుందని అనుకున్నాడు. అయితే అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది. కట్టుకున్న భార్య, అత్తమామలే తన పాలిట యమకింకరులవుతారని ఊహించలేకపోయాడు. వారి వేధింపులు తాళలేక పెళ్లై నాలుగు నెలలు గడవక ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్లో జరిగింది.
కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని..
పెళ్లైన నాటి నుంచి వేధింపులు
ఇబ్రహీంపట్నం గున్గల్ గేట్కు చెందిన జనార్థన్ రెడ్డి కుమారుడు సుమంత్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అతనికి శంషాబాద్కు చెందిన స్వప్నతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వారు కుటుంబ సభ్యులతో కలిసి అత్తాపూర్లోని లక్ష్మీపోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు అంతా సజావుగా సాగింది. ఆ తర్వాత భార్యతో చిన్న చిన్న గొడవలు జరగడం ఆ విషయంలో ఆమె తల్లిదండ్రులు తలదూర్చడం పరిపాటిగా మారింది. వారంతా చీటికిమాటికి సుమంత్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అత్తమామలకు భార్య తోడవడం వేధింపులు రోజురోజుకు పెరిగాయి.
సూసైడ్ నోట్ రాసి
భార్య, అత్తామామల వేధింపులు పెరిగిపోవడంతో సుమంత్ రెడ్డి వాటిని భరించలేకపోయాడు. చివరకు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 20న భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో సాయంత్రం తన బెడ్ రూంలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. 5.30గంటల సమయంలో కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన చావుకు భార్య, అత్తమామ, వారి కుటుంబసభ్యులే కారణమని సుమంత్ సూసైడ్ నోట్లో రాశాడు. తన ఆత్మహత్యకు కారణైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, అంత్యక్రియలకు వారు రాకుండా చూడాలని అందులో స్పష్టం చేశాడు.
కేసు బుక్ చేసిన పోలీసులు
సుమంత్ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని భార్య స్వప్న, అత్త పద్మ, స్వప్న కజిన్ శ్రీ, బాబాయిపై కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అయితే ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు విషయం బయటపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.