సాంకేతిక పరిజ్ఞానంలో నగరం మరో ముందడుగు..! హైదరాబాద్లో డేటా చౌర్య నిరోధక కేంద్రం..!!
హైదరాబాద్: సైబర్ నేరాలు, మోసాల నియంత్రణకు, డేటా చౌర్యాన్ని నిరోధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ సైబర్ క్లస్టర్లు సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హేగ్లో మాత్రమే ఇలాంటి కేంద్రం ఉంది. ఐటీ పరిజ్ఞానంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలకు కొత్తగా ప్రారంభమయ్యే కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. హైదరాబాద్లో వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ కేంద్రం సేవలందించే అవకాశాలున్నాయని హైదరాబాద్ సైబర్ క్లస్టర్ సీఈవో జకీర్ ఖురేషి తెలిపారు.
ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం: అతి పెద్ద కుంభకోణాలు..అస్సలు బాధ్యత లేని మోడీ
సైబర్ నేరాలకు అడ్డుకట్ట..! వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం..!!
హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. సైబర్ నేరాల నియంత్రణపై కేంద్రం నాలుగేళ్ల క్రితం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా నెదర్లాండ్స్తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా అన్నిరాష్ట్రాలు సైబర్ క్లస్టర్లను ప్రారంభించి తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర సంస్థలకు సైబర్ భద్రత కల్పించాలని చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్, దిల్లీలో మాత్రమే సైబర్ క్లస్టర్లు మొదలయ్యాయని తెలిపారు. బెంగళూరు, దిల్లీలో కార్యకలాపాలు ఆగిపోయాయని చెప్పారు.
ఐటీలో మేటి మనమే..! ప్రపంచంలోనే రెండో కేంద్రం..!!
మూడేళ్ల నుంచి హైదరాబాద్ సైబర్ క్లస్టర్పై అవగాహన కల్పించడంతో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు సభ్యులయ్యాయని, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ, జేఎన్టీయూహెచ్ వంటి ప్రభుత్వ విద్యాసంస్థలు సైబర్ క్లస్టర్స్లో భాగస్వాములయ్యాయని వివరించారు. రెండోదశలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, పరిశోధక సంస్థలు, విద్యార్థులను భాగస్వాములను చేసుకోనున్నామని తెలిపారు.
డేటా చౌర్యం పై ప్రత్యేక ద్రుష్టి..! పకడ్బందీ చర్యలకు పోలీసుల సన్నాహాలు..!!
కాగా రెండో దశపూర్తయ్యాక డేటా చౌర్యాన్ని నిరోధించే కేంద్రం పనిచేయడం మొదలవుతుందని చెప్పారు. అత్యాధునిక సమాచార పరిజ్ఞాన వినియోగంలో దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణ నిలిచిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో ముందున్నామని చెప్పారు.
అందుబాటులోకి సాంకేతికత..! పరిజ్ఞానంతో అడ్డుకోవాలని ప్లాన్..!!
ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాలపై న్యూయార్క్కు చెందిన మెర్సర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వరుసగా నాలుగోసారి హైదరాబాద్ స్థానం దక్కించుకుందని గుర్తుచేశారు. డేటాచౌర్యం, రాన్సమ్ వేర్ వంటి సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని వెరైజాన్ కమ్యూనికేషన్ ఇండియా ప్రతినిధి ప్రశాంత్గుప్తా తెలిపారు. డేటాచౌర్యం, రాన్సమ్వేర్తో పాటు ఇతర సైబర్ నేరాలపై గతేడాది విశ్లేషించిన నివేదికను విడుదల చేశామని పేర్కొన్నారు.