చందానగర్ లాడ్జీలో యువతిని చంపింది ప్రియుడే: పెళ్లికి ఒత్తిడి చేయడంతో ఘాతుకం
హైదరాబాద్: చందానగర్లోని ఓ లాడ్జీలో అనుమానాస్పాద స్థితిలో మృతి చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన యువతి నాగచైతన్య(24) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేధించారు. నాగచైతన్యను తానే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో ప్రియుడు కోటిరెడ్డి ఎట్టకేలకు అంగీకరించాడు. దీంతో ఈ హత్య కేసు మిస్టరీ వీడినట్లయింది.
లాడ్జీలో ప్రియురాలిని హత్య చేసి ఒంగోలుకు పరార్..
కత్తితో నాగచైతన్య గొంతుకోసి హత్య చేసినట్లు కోటిరెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కోటిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. ఘటన అనంతరం ఒంటిపై గాయాలు చేసుకున్న నిందితుడు భయంతో ఒంగోలు పారిపోయి అక్కడ ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలి అనుమానమే నిజమైంది..
కాగా, నాగచైతన్యను కోటిరెడ్డి నమ్మించి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఇప్పుడు వారి ఆరోపణలే నిజమయ్యాయి. పెళ్లి చేసుకోవడానికి ఇష్టంలేకే దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఘటనపై హత్య కేసుగా నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన చందానగర్ పోలీసులు చివరకు కోటిరెడ్డే నిందితుడని తేల్చారు.
పరిచయం.. ప్రేమ.. విషాదం
ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె నాగచైతన్య.. గత కొంత కాలంగా హైదరాబాద్లోని చందానగర్ నల్లగండ్ల సిటిజన్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. యువతి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. సవతి తల్లి మాత్రం ఉంది. కాగా, గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటెటీవ్గా పనిచేస్తున్నాడు. తరచూ అతడు ఈ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కాగా, వీరి సామాజికి వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23న ఆస్పత్రి ఎదురు ప్రాంతంలోని ఓ లాడ్జీలో గది తీసుకుని, అక్కడే కలిసి వున్నారు. ఆ తర్వాతి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య విగతజీవిగా పడివుంది.
ప్రియురాలిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కోటిరెడ్డి యత్నం
లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. కాగా, కోటిరెడ్డి కూడా పొట్ట, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె గొంతు కోసుకుందని, భయంతో తాను వచ్చేశానని కోటిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇక లాడ్జీ గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలుండటం, రక్తం మడుగును కడిగేందుకు ప్రయత్నించినట్లు ఆనవాళ్లుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే యువతి నాగచైతన్యను కోటిరెడ్డే హత్య చేసి తనకు సంబంధం లేనట్లుగా నాటకం ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. కోటిరెడ్డిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే నాగచైతన్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.