త్వరలో తెలంగాణ బీజేపి అద్యక్షుడి మార్పు..!? బరిలో బండి సంజయ్..!??
హైదరాబాద్ : దక్షిణ భారతంలో అడుగు పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ తెగ ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా రెంగు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ప్రభావాన్ని చాటుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణాదీన పాగా వేసేందుకు అనువైన రాష్ట్రంగా బీజేపీకి మొదట తెలంగాణ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, అమిత్ షా ఇక్కడే సభ్యత్వ నమోదు చేపట్టి సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. 2024లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపి వ్యూహం రచిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్- టీఆర్ఎస్ మాజీలను చేర్చుకుంటూ దూకుడుగా ముందుకెళ్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానం బీజేపీ గెలిచేసరికి అధిష్టానం తెలంగాణ వైపే చూడలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచే సరికి ఇక బీజేపీ ఆపరేషన్ తెలంగాణ చేపట్టింది. ఏపీతో పాటు తెలంగాణ లోనూ బలపడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేసరికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమాగా ఉన్నారు.
ఐతే పార్టీ మరింత బలంగా జనాల్లోకి వెళాలంటే లక్ష్మణ్ సామర్థ్యం సరిపోదని, దూకుడుగా వ్యవహరించే కొత్త నేత కావాలని బీజేపి అదిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే లక్ష్మణ్ ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపి అదిష్టానం. తెలంగాణలో ఇప్పుడు అధ్యక్షుడి మార్పు అనివార్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీపై కొండంత ఆశతో ఇతర పార్టీల నుంచి చేరిన వారిని సంతృప్తిపరచడం.. కొత్తగా గెలిచి తెరపైకి వచ్చిన వారిని గౌరవించడంతోపాటు తెలంగాణ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా ఈ అధ్యక్ష రేసులో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు కరీంనగర్ నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరితోపాటు బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన సీనియర్లు డీకే అరుణ- జితేందర్ రెడ్డిలకు కూడా అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరి ఈ ఐదుగురిలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు.? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.