ఎంత పని చేసింది బీజేపీ అధిష్టానం.. మా నోరు మూయించిందని బాధపడుతున్న రాష్ట్ర నేతలు
హైదరాబాద్ : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కమలం పువ్వు హవాతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నాలుగు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కొత్త ఉత్సాహం నింపింది. అదే క్రమంలో టీఆర్ఎస్కు చెక్ పెట్టేలా రాష్ట్ర బీజేపీ నేతలు సరికొత్త వ్యూహాలకు తెరతీశారు. టీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టే విధంగా పావులు కదుపుతున్నారు.
ఇతర పార్టీల జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేలకు గులాబీ తీర్థం పోస్తున్న టీఆర్ఎస్ అధిష్టానంపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమేంటని మండిపడుతున్నారు. ఆ క్రమంలో ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ తీరును ఎండగట్టి బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దలు తాజాగా తీసుకున్న నిర్ణయం ఇక్కడి నేతలకు నోటి మాట రాకుండా చేస్తోంది. పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్ను ఇరకాటంలో పెడదామనుకున్న ప్లాన్ బెడిసికొట్టినట్లైంది.
కేసీఆర్, జగన్కు కులతోకలు ఎందుకు.. నెట్టింట డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు రచ్చ రచ్చ..!
ఆపరేషన్ కమల తీర్థం
ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. సుజనా చౌదరి, గరికపాటి మోహన్రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ కమల తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు.
టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని, అందువల్ల ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు..!
మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రగతి.. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను చూసి ఏపీ ప్రయోజనాల కోసం నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరాలని చాలాకాలంగా భావిస్తున్నారని నడ్డా తెలిపారు. అందులో భాగంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తామని వారు కోరినట్లు చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతించడంతో.. ఆ మేరకు విలీన పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశామని చెప్పుకొచ్చారు.
విలీనం పూర్తికావడంతో ఇకపై వీరు బీజేపీ ఎంపీలుగా మారిపోయారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలను విశ్వసిస్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదం ధ్యేయంగా తాము ముందుకు సాగుతామన్నారు. వీరి చేరికల వల్ల ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఢిల్లీ పెద్దల నిర్ణయం.. తెలంగాణ నేతల దూకుడుకు బ్రేక్..!
బీజేపీ ఢిల్లీ పెద్దల తాజా నిర్ణయంతో తెలంగాణ బీజేపీ నేతలకు పాలుపోవడం లేదు. పార్టీ ఫిరాయింపుల పేరిట టీఆర్ఎస్ను ఓ ఆట ఆడుకుందామని భావించిన రాష్ట్ర బీజేపీ నేతలకు చుక్కెదురైనట్లైంది. లోక్సభ ఎన్నికల ఫలితాల జోష్తో 2023లో తెలంగాణలో తమదే అధికారమంటూ బీజేపీ స్టేట్ లీడర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీ అధినాయకత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారిని ఇరకాటంలో పడేసినట్లైంది.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్పై తెలంగాణ బీజేపీ నేతలు యుద్ధభేరి ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు తీసుకున్న నిర్ణయం వారిని నిరాశకు గురిచేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ అంశంపై ఇక మాట్లాడేందుకు వారికి ఛాన్స్ లేనట్లయింది. దాంతో ఇతర ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.